యాప్నగరం

కాపు రిజర్వేషన్ల‌పై వైఖరి స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పోరాట యాత్ర పేరిట పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ విధానాన్ని ప్రకటించారు.

Samayam Telugu 12 Aug 2018, 10:44 am
జనసేన పోరాట యాత్ర పేరిట పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ విధానాన్ని ప్రకటించారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తామని పవన్ తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంశంపై స్పందించే సమయంలో జనసేనాని జాగ్రత్తగా వ్యవహరించారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు మేం రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచేందుకు సిద్ధమని, దీన్ని జనసేన మేనిఫెస్టోలో పెడతామని పవన్ తెలిపారు.
Samayam Telugu pk7


కాపు రిజర్వేషన్ల అంశంపై స్పందించిన సమయంలోనే బీసీలు, ఎస్సీలు, ముస్లింల అభ్యున్నతిని పవన్ ప్రస్తావించారు. ముస్లింల అభ్యున్నతికి సచార్ కమిటీ చెప్పిన విధివిధానాల అమలుకు జనసేన కట్టుబడుతుందని పవన్ తెలిపారు. ఎస్సీలను ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకురావడమే తమ పార్టీ ఆశయమని జనసేనాని చెప్పారు.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల యువతకు అండగా ఉండేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటును జనసేన మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పవన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చు పెట్టారని జనసేనాని విమర్శించారు.

కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ల అంశం తన చేతుల్లో ఏం లేదని ప్రకటించారు. కాపు కార్పొరేషన్‌కు నిధులను రెట్టింపు చేస్తామని తెలిపారు. జగన్ ప్రకటన ఏపీలో సంచలనమైంది. దీంతో ఆ సమయంలో కాపు రిజర్వేషన్ల విషయమై పవన్ జాగ్రత్తగా స్పందించారు. న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, మేధావులతో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.