యాప్నగరం

Pawan Kalyan చూపు బీజేపీ వైపు.. జనసేనాని పాదయాత్ర!

BJP | జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా బీజేపీతో దోస్తీపై చర్చించినట్టు తెలుస్తోంది.

Samayam Telugu 31 Jul 2019, 10:14 pm
అమరావతి: గత రెండు రోజులపాటు పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన ఓటమి, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. బీజేపీతో కలిసి పని చేసే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిస్తేనే పార్టీ బతుకుతుందనే వాదనను ఆయన కీలక నేతల వద్ద పరోక్షంగా వినిపించారని తెలుస్తోంది. జగన్‌ను ఢీ కొట్టడానికి బీజేపీతో స్నేహమే సరైందని జనసేన నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అమెరికాలో పవన్, రాంమాధవ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనను బీజేపీలో విలీనం చేయాలని రాం మాధవ్ ప్రతిపాదించారని సమాచారం.
Samayam Telugu pspk2


కానీ ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా.. పార్టీని బీజేపీలో విలీనం చేయడం కంటే, కలిసి పని చేస్తే బాగుంటుందని పార్టీ జనసేన ముఖ్య నేతలు పవన్‌కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తమ పార్టీకి బీజేపీ అంత ప్రాధాన్యం ఇస్తుందా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అందుకే బీజేపీతో సాధ్యమైనంత వరకూ సఖ్యతతో ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పొత్తులు, ఎత్తులు అన్నీ ఎన్నికల ముందు నిర్ణయిద్దామని పవన్ కల్యాణ్ చెప్పారని సమాచారం. ఎన్నికల ముందు అనుకున్న వాటిలో ఏ ఒక్కటీ జరగలేదని, ఫలితాలన్నీ ప్రతికూలంగానే వచ్చాయని పవన్ చెప్పారు. అతివిశ్వాసం కొంప ముంచిదనేది పవన్ భావనగా కనిపిస్తోంది. జనాల్లోకి వెళ్లకపోవడమే ఓటమికి ప్రధాన కారణంగా జనసేనాని భావిస్తున్నారు. అందుకే ఇకపై ప్రజాసమస్యలపై పోరాడాలని, నిత్యం జనాల్లో ఉండాలని పవన్ నిర్ణయించారు.

జగన్ భారీ విజయం సాధించడానికి ఎనిమిదేళ్ల పాటు జనాల్లో ఉండటమే కారణమనే విషయం కూడా జనసేన నేతల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. మీడియాలో వచ్చిన నెగెటివ్ పబ్లిసిటీ కూడా జగన్‌కు కలిసొచ్చిందని, ప్రజల్లో ఆయనకు విపరీతమైన సానుభూతి తెచ్చిపెట్టిందని, కానీ జనసేనకు అసలు మీడియా కవరేజ్ ఇవ్వలేదని పవన్ తెలిపారు. ఎన్నికల ముందు ప్రధాన మీడియా ఛానెళ్లతో గొడవ కారణంగా ఆ ఛానెళ్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో తాను మీడియాకు పూర్తిగా దూరమైపోయానని జనసేనాని భావిస్తున్నారు. అందుకే ఇకపై మీడియాతో సఖ్యతగా మెలిగేందుకు పార్టీ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలని ఆదేశించారు. అన్ని మీడియా ఆఫీసులకు వెళ్లి యాజమాన్యాలతో మాట్లాడేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పార్టీలో కొందరు జనసేనాని దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో మనం జనాల్లోకి వెళ్లి ప్రజాసమస్యలపై తీవ్రంగా పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని పవన్‌కు సలహా ఇఛ్చారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని ఇంకో ముఖ్యనేత సలహా ఇచ్చారు.

పాదయాత్ర చేయడం కచ్చితంగా మంచిదే కానీ, తాను రోడ్డు మీది కొస్తే ఫ్యాన్స్ హడావిడి చాలా ఎక్కువగా ఉంటుందని, వారిని కంట్రోల్ చేయడం కష్టమని పవన్ చెప్పారు. జగన్‌కు కూడా క్రేజ్ ఉందని, కానీ ఆయన వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఎక్కడా పెద్దగా ఇబ్బంది కలగలేదని నేతలు పవన్‌కు చెప్పారు. చంద్రబాబు కూడా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, పాదయాత్ర చేసిన వాళ్లంతా సీఎం అయిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. అప్పుడు రాజశేఖరరెడ్డి, తర్వాత చంద్రబాబు, ఇప్పుడు జగన్.. ఇలా పాదయాత్ర చేసిన వాళ్లంతా సీఎంలు అయ్యారని చెప్పారు. దీంతో తాను కూడా పాదయాత్ర చేసే దిశగా పవన్ యోచిస్తున్నారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.