యాప్నగరం

Jana Sena: ‘రెడ్ రెవల్యూషన్’.. జనసేన వినూత్న ప్రచారం!

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాసమస్యలపై స్థానికంగా అధ్యయనం కోసం, ఆ సమస్యల పరిష్కారం విషయంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ‘రెడ్ రెవల్యూషన్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Samayam Telugu 6 Aug 2018, 7:16 pm
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాసమస్యలపై స్థానికంగా అధ్యయనం కోసం, ఆ సమస్యల పరిష్కారం విషయంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ‘రెడ్ రెవల్యూషన్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన స్థానిక నేతలు ఈ ప్రజా సమస్యల ప్రస్తావన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
Samayam Telugu Janasena3

ఇందులో భాగంగా.. గ్రామాలన్నీ తిరుగుతూ వివిధ పార్టీల నాయకులు, ప్రజలతో చర్చించి, ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిని గ్రామంలోని ఒక గోడపై రాస్తున్నారు, గోడకు ఎరుపు రంగు వేసి దానిపై తెలుపు రంగులో సమస్యలను రాస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన నాయకుడు కస్తూరి సత్య ప్రసాద్ (నాని) ఈ రెడ్ రెవల్యూషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
‘మా రెడ్ రెవల్యూషన్ టీం గుర్తించిన సమస్యలన్నింటినీ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో తప్పనిసరిగా చేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు, వార్షిక రాష్ట్ర బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని కస్తూరి నాని స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని జనసేన భావిస్తోంది.
గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి కొంత సానుకూలత ఉంది. పవన్ కల్యాణ్‌ను బాగా ఓన్ చేసుకునే కాపు సామాజికవర్గం ఓట్లు ఈ జిల్లాల్లో గణనీయంగా ఉన్నాయి. అయితే కాపు ఓట్లపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు కూడా కొంత ఆశలున్నాయి. కాపు సామాజికవర్గంలో మెజారిటీ మంది మాత్రం జనసేన వైపునే నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.