యాప్నగరం

ఉద్దానంలో పుట్టడమే మేం చేసిన పాపం

ఉద్దానంలో పుట్టడమే తాము చేసిన పాపమని ఆ ప్రాంత ప్రజలు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ వద్ద తమ ఆవేదనను వెల్లడించారు.

TNN 3 Jan 2017, 12:00 pm
ఉద్దానంలో పుట్టడమే తాము చేసిన పాపమని ఆ ప్రాంత ప్రజలు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ వద్ద తమ ఆవేదనను వెల్లడించారు. కనీసం వైద్యం చేయించుకునే స్తోమతలేని తమను ప్రభుత్వం ఆదుకోవడంలేదని కంటతడి పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కిడ్నీ వ్యాధితో వణికిపోతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒకటని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశోధనలో వెల్లడైందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
Samayam Telugu janasena party president pawan kalyan interact with uddanam kidney patients in ichapuram
ఉద్దానంలో పుట్టడమే మేం చేసిన పాపం


నిజానికి శ్రీకాకుళం జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని గ్రామాలను ఉద్దానంగా వ్యవహరిస్తారు. కారణం గోదావరి జిల్లాల తరవాత ఇక్కడే అత్యధికంగా కొబ్బరిని సాగు చేస్తారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. పవన్ కల్యాణ్ ఉద్దానం బాధితులను పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్తున్నారు అని తెలియడంతో ఉద్దానం గురించి ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు. అది కూడా కిడ్నీ బాధితుల ప్రాంతంగానే.

గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలోని వందలాది మందిని కిడ్నీ వ్యాధి పొట్టనబెట్టుకుంది. కానీ ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియదు. కనీసం ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లలేదు. ఈ విషయాన్నే పవన్ కల్యాణ్ ఈరోజు ప్రస్తావించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడిన ఆయన వారికి భరోసా ఇచ్చారు. కిడ్నీ బాధితులకు న్యాయం జరిగేలా జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పారు.

పార్టీ తరఫున ఒక కమిటీ వేసామని, ఉద్దానం సమస్యపై 15 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. ఈ నివేదికతో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి సమస్య తీవ్రతను వివరిస్తానని హామీ ఇచ్చారు. కిడ్నీ బాధిత ఉద్దానం ప్రాంతంలో జనసేన పార్టీ కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని, కావలసిన సాయం అందజేయాలని పవన్ పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడికి రాలేదని, బాధితులను పరామర్శించడానికి మాత్రమే వచ్చానని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.