యాప్నగరం

జనసేనకు ఒక్క సీటూ రాదు, పవన్ ఓడిపోతారు: టీడీపీ ఎంపీ

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసినా కనీసం ఒక్క సీటు కూడా రాదు అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ

Samayam Telugu 20 Aug 2018, 3:22 pm
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసినా కనీసం ఒక్క సీటు కూడా రాదు అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని. విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసినా ఓడిపోతారని ఈ ఎంపీ వ్యాఖ్యానించడం విశేషం. అతి విశ్వాసంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అని టీవీ చానల్ ప్రతినిధి అడిగినా... అలా ఏం కాదని, తనకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసని, తన అంచనాలు తప్పవని ఈ ఎంపీ చెప్పుకొచ్చారు.
Samayam Telugu pavan2

పవన్ కల్యాణ్‌ను తను దగ్గర నుంచి గమనించాను అని ఆయనకు స్థిరత్వం ఉండదని, ఒక మాట మీద నిలబడలేరని... ఈ తెలుగుదేశం నేత అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ తర్వాత బయటకు వచ్చిన నేపథ్యం ఉంది కేశినేని నానికి. చిరంజీవితో పోల్చి చూసినప్పుడు పవన్ కల్యాణ్ చిన్నబోతారని.. పవన్ కల్యాణ్ తో పోలిస్తే చిరంజీవి అనేక రెట్లు శక్తిమంతుడు అని, పవన్ కల్యాణ్ కన్నా చిరంజీవికి క్రేజ్ కూడా చాలా ఎక్కువ అని నాని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ అనేది చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు కలిసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని.. దానికే 18 సీట్లు వచ్చాయని, చిరంజీవి స్వయంగా పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ కల్యాణ్‌కూ అదే అనుభవం అని తప్పదని నాని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ చెప్పిన ప్రతి సమస్యనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిష్కరించేశారని.. అయినా ఆయన యూటర్న్ తీసుకున్నారని ఈ టీడీపీ ఎంపీ చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.