యాప్నగరం

CM Jaganను కలిసి జపాన్ కాన్సులేట్ జనరల్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను చెన్నైలో ఉన్న జపాన్ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు ఎందుకు తెచ్చామనేది కూడా వివరించారు.

Samayam Telugu 29 Jul 2019, 10:11 pm
అమరావతి: చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉచియామ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు సీఎం వివరించారు.
Samayam Telugu Kojiro Uchiyama


పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని జగన్ ఆకాంక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తి స్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం వివరించారు. ఏ దశలోనూ లంచాలకు, రెడ్‌ టేపిజానికి తావు లేని విధంగా వ్యవహరిస్తామన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతి, సహృద్భావ వాతావరణం కూడా అవసరమని, దీంట్లో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌‌కు జగన్ తెలిపారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి ఉన్న మానవ వనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ కూడా ముఖ్యమంత్రి వివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఆ దిశగా పెట్టుబడుల పెట్టే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమలకోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వం తెలిపింది. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. అత్యాధునిక వసతులున్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉన్నందున జపాన్‌ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలమని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయ శాఖ మిజుహో ఇన్ఫర్మేషన్‌ మరియు రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.