యాప్నగరం

కుర్చీలతో కొట్టుకోబోయిన టీడీపీ నేతలు!

ఈ టీడీపీ నేతల మధ్యన విబేధాల పర్వం కొనసాగుతోంది.

TNN 1 Dec 2017, 11:07 am
ప్రకాశం జిల్లా టీడీపీ నేతల మధ్యన విబేధాల పర్వం కొనసాగుతోంది. పార్టీలోకి కొత్తగా చేరి వచ్చిన గొట్టిపాటి రవికుమార్, పార్టీ సీనియర్ నేత కరణం బలరాంల మధ్య పోరాటం కొనసాగుతోంది. ఇది వరకూ వివిధ సందర్భాల్లో ఈ ఇద్దరు నేతలూ తమ తమ వర్గాలతో అమీతుమీ తలపడ్డారు. బాహాబాహీకి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా సందర్భాల్లో పార్టీ నేతలు సర్దిచెబుతూ వచ్చారు. అయితే వీళ్ల మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా గురువారం పార్టీ సమన్వయ సమావేశంలో గొట్టిపాటి, కరణంలు పరస్పరం దాడికి దిగారు.
Samayam Telugu karanam balaram vs gottipati fought again
కుర్చీలతో కొట్టుకోబోయిన టీడీపీ నేతలు!


మంత్రులు హాజరైన ఈ సమావేశంలో ఈ ఇద్దరు నేతలూ పరస్పరం దాడి చేసుకున్నంత పని చేశారు. చెరో కుర్చీ చేతబట్టి.. వాటితో కొట్టుకోబోయారు. చివరకు సమన్వయ కమిటీ భేటీకి హాజరైన మిగతా నేతలు వారిని పట్టుకుని గొడవ తీవ్రతరం రాకుండా అడ్డుపడ్డారు. వారికి సర్ది చెప్పి కుర్చీలు పక్కకు లాక్కొన్నారు. దీన్ని బట్టి కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య ఇంత వరకూ రాజీ కుదరలేదని స్పష్టం అవుతోంది.

గత ఎన్నికల్లో గొట్టిపాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నుంచి పోటీ చేసి గెలిచారు. అక్కడ కరణం వెంకటేష్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రెండు వర్గాలకూ చాలా కాలం నుంచినే రాజకీయ వైరం ఉంది. అయితే.. గొట్టిపాటిని తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలోనే బలరాం అభ్యంతరం చెప్పారు. అయితే ఆ అభ్యంతరాలను తెలుగుదేశం అధినేత పట్టించుకోలేదు.

ఇరు వర్గాలూ రాజీకావాలని ఆదేశించారాయన. అయితే.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇరు వర్గాలకూ ఏ మాత్రం పొసగడం లేదు. పార్టీ సమావేశాల్లోనే వీరు తలపడుతున్నారు. తాజాగా వీరిద్దరూ గొడవపడిన వైనం గురించి మంత్రులు పరిటాల సునీత, శిద్ధా రాఘవరావులు పార్టీ అధిష్టానానికి వివరించినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.