యాప్నగరం

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ!

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న కత్తి మహేశ్‌‌ను నగరం నుంచి బహిష్కరించాలని హైదరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 9 Jul 2018, 12:51 pm
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న కత్తి మహేశ్‌‌ను నగరం నుంచి బహిష్కరించాలని హైదరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా అతడు హైదరాబాద్‌ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీచేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, డీసీపీలు, ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల శ్రీరాముడిని ఉద్దేశించి కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై హిందూ ధార్మిక సంఘాలు నిరసన వ్యక్త చేయడం లాంటి అంశాలపై డీజీపీ చర్చించారు. అలాగే అతడిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
Samayam Telugu కత్తి మహేశ్


సమాజంలో అలజడులు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేశ్‌ నగరంలో ఉండటానికి అనర్హుడంటూ ఈ సమావేశంలో పోలీస్ అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి సోమవారం నాడు ధర్మాగ్రహ యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టునున్నట్టు ఆదివారం ప్రకటించారు.

చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించామని, దీనికి హిందువులందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే పరిపూర్ణానంద పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పరిపూర్ణానందను బయటకు రాకుండా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. మరోవైపు స్వామిజీ యాత్రకు నటుడు నాగబాబు, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కూడా మద్దతు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.