యాప్నగరం

మంత్రి పదవి గురించి నాకేం తెలుసు: కేటీఆర్

TRS | టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదును గడిచిన నెల రోజుల్లో గణనీయంగా చేపట్టామని కేటీఆర్ తెలిపారు. కేవలం నెల రోజుల్లోనే సభ్యత్వాలు 50 లక్షలకు చేరడం చాలా సంతోషం కలిగించిందన్నారు. ప్రతి సభ్యుడికి ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Samayam Telugu 31 Jul 2019, 8:03 pm
మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వచ్చే విషయం తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మంగళవారం (జులై 31) మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్‌గా తనకు పార్టీ కార్యక్రమాల గురించి మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. మంత్రి పదవుల గురించి తనకేం సంబంధం లేదన్నారు.
Samayam Telugu KTR33


50 లక్షలకు చేరడం సంతోషం..
గడిచిన నెల రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు 50 లక్షలకు చేరడం చాలా సంతోషాన్ని కలగజేసిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనతో గడిచిన ఐదేళ్ల నుంచి ప్రతి టీఆర్ఎస్ సభ్యుడికి రూ. 2 లక్షల ఆరోగ్య బీమా చెల్లిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

క్రియా శీల సభ్యత్వం తీసుకున్నా, సాధారణ సభ్యత్వం తీసుకున్నా అందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదులో క్రియాశీలంగా వ్యవహరించి, విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీమా కంపెనీకి రూ. 11.21 కోట్ల ప్రీమియం చెక్కును అందజేశారు. రేపటి నుంచే బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Read also: Harish Rao, సబితకు మంత్రి పదవులు.. త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ!

విమర్శించడానికి సమస్యలు లేవు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడుపుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు సమస్యలేం కనిపించకపోవడంతో చౌకబారు అంశాలపై విమర్శలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని సవాల్ విసిరారు. మున్నిపల్ ఎన్నికల తేదీలు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నాయని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగిరేలా కృషి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

గవర్నర్ తనకు తండ్రి లాంటి వారనీ, ఇటీవల ఆయణ్ని మర్యాదపూర్వకంగానే కలిశానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ, మండల, పట్టిణ కమిటీలను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ భవనాలు నిర్మించి, సంస్థాగత నిర్మాణం కోసం కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచనలతో టీఆర్ఎస్ కార్యకర్తలను దేశంలోనే క్రమశిక్షణ గల కార్యకర్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.