యాప్నగరం

పెళ్లికి ఒప్పుకోని పెద్దలు.. విషం తాగి ప్రేమికులు ఆత్మహత్య

వరుసకు బావా మరదళ్లైన ఇద్దరు యువతీ, యువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ ఇష్టం ప్రేమగా మారడంతో ఏడాదిగా ప్రేమించుకుంటోన్న వీరు మూడు ముళ్లతో ఒక్కటి కావాలని భావించారు.

Samayam Telugu 27 Jan 2019, 10:03 am
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడింది. విషాదకరమైన ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం మహాగాం గ్రామానికి చెందిన మడపాచి భరత్‌(22), గౌరుబాయి(18) వరుసకు బావామరదళ్లు అవుతారు. ఈ ఇద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేమని నిర్ణయించుకున్న ఈ ప్రేమ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పెళ్లికి వారు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌరుబాయి, శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు మెహపత్, సూర్యకళాబాయిలు బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
Samayam Telugu sui3


ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను వైద్యం కోసం వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. ప్రియురాలు మృతిచెందిన విషయం తెలుసుకున్న భరత్‌ కూడా శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించి అతడి కుటుంసభ్యులు హుటాహుటీన చికిత్స కోసం ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లోనే మృతి చెందాడు. ప్రేమికుల ఆత్మహత్యతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రెండు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.