యాప్నగరం

హైవేపై దగ్ధమైన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి అనకాపల్లి బయల్దేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుని కాలి....

Samayam Telugu 29 Apr 2017, 10:11 am
హైదరాబాద్ నుంచి అనకాపల్లి బయల్దేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్ వద్ద శనివారం ఉదయం 6:45 నిమిషాలకి ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలోనే అందులోంచి పొగలు రావడాన్ని ఆ వెనకే వస్తోన్న వాహనదారులు గుర్తించి, అదే విషయాన్ని బస్సు డ్రైవర్‌కి తెలిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, బస్సుని పక్కకు ఆపేసి ప్రయాణికులు అందరినీ కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు.
Samayam Telugu lucky escape for 40 passengers as bus caught fire enroute
హైవేపై దగ్ధమైన బస్సు.. తప్పిన పెను ప్రమాదం


ప్రయాణికులు, సిబ్బంది దిగిపోయిన కాసేపట్లోనే బస్సు మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తూ వీళ్లంతా సకాలంలో స్పందించి బస్సులోంచి కిందికి దిగిపోవడంతో తృటిలో పెను ప్రమాదమే తప్పింది. లేదంటే ఊహించని స్థాయిలో భారీ నష్టమే జరిగి వుండేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లంతా ఓ పెళ్లి బృందం వారేనని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గురైన బస్సుని హైదరాబాద్ మీర్‌పేట నుంచి అనకాపల్లి బయల్దేరిన కావేరి ట్రావెల్స్‌కి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటన కారణంగా జాతీయ రహదారిపై దాదాపు 2 గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. దీంతో ఆ రహదారిపై ప్రయాణించే వారు రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికిగల కారణాలు ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు అని అన్నారు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.