యాప్నగరం

ఏపీ డీజీపీగా మాలకొండయ్య నియామకం ఖరారు

ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్‌గా ఎం. మాలకొండయ్య నియామకం ఖరారైంది. ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా మాలకొండయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం (డిసెంబర్ 30) సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

TNN 30 Dec 2017, 10:48 pm
ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్‌గా ఎం. మాలకొండయ్య నియామకం ఖరారైంది. ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా మాలకొండయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం (డిసెంబర్ 30) సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుత డీజీపీ ఎన్. సాంబశివరావు ఆదివారమే (డిసెంబర్ 31) పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. డీజీపీ రేసులో ఆర్పీ ఠాకూర్, గౌతం సవాంగ్‌ తదితర పేర్లు వినిపించినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరికి మాలకొండయ్య వైపే మొగ్గుచూపారు. సీనియారిటీ ప్రకారం కూడా ఆయనకే అవకాశాలున్నాయి.
Samayam Telugu m malakondaiah appointed as dgp of andhra pradesh
ఏపీ డీజీపీగా మాలకొండయ్య నియామకం ఖరారు


1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య.. గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మూడో డీజీపీగా మాలకొండయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఆరు నెలల పాటు కొనసాగుతారు.

మాలకొండయ్య స్వస్థలం ప్రకాశం జిల్లా. పాఠశాల విద్యను ప్రకాశం జిల్లాలోనే పూర్తిచేసిన ఆయన కళాశాల విద్యను గుంటూరులో అభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి క్రిమినాలజీలో డాక్టరేట్‌ పట్టా పొందిన మాలకొండయ్య.. న్యాయశాస్త్రం, వ్యవసాయ విద్య పట్టభద్రులు కూడా. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఆయన పీజీ డిప్లొమో కూడా చేశారు.

సమైక్య రాష్ట్రంలో తూర్పుగోదావరి, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ హోదాల్లో సేవలందించారు. గుంటూరు, ఏలూరు రేంజిల్లో డీఐజీగానూ పనిచేశారు. ట్రాన్స్‌కో సీఎండీగా, ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా, ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది నవంబర్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఐపీఎస్‌కు ఎంపిక కాకముందు ఆయన కొంతకాలం పాటు బ్యాంకు ఉద్యోగిగానూ పనిచేశారు.

విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించడమే కాకుండా సౌమ్యుడిగా మాలకొండయ్యకు మంచి పేరుంది. ఏపీ పోలీస్‌ అకాడమీలో గెజిటెడ్‌ అధికారుల కోసం సరికొత్త శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను కేంద్ర హోంశాఖ నుంచి పురస్కారం కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఏపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆయన సతీమణే కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.