యాప్నగరం

విషాదం: తండ్రి మరణంతో కొడుకు గుండె ఆగింది

తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కుమారుడి గుండె ఆగింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

Samayam Telugu 14 Aug 2018, 10:17 am
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కుమారుడి గుండె ఆగింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు మండలం మారేపల్లికి చెందిన పసుపులేటి నరసింహారావు (65) గత కొద్ది రోజులుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. అతడి కుమారులు నాగేశ్వరరావు, పిచ్చేశ్వరరావు తండ్రికి దగ్గరుండి సపర్యలు చేశారు. తండ్రంటే పెద్దకొడుకు నాగేశ్వరరావు (45)కి ఎనలేని అభిమానం. ఆయన న్యాగా అని ముద్దుగా పిలిచే తండ్రి పిలుపంటే ఎంతో ఇష్టం. తండ్రికి కేన్సర్ సోకడంతో ఆయను చికిత్సకు తీసుకెళ్లి, దగ్గరుండి మందులు ఇచ్చేవాడు. సోమవారం మధ్యాహ్నం తండ్రి తుదిశ్వాస విడవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రిపై అంతులేని ప్రేమను పెంచుకున్న నాగేశ్వరరావు (45) ఆయన మృతిని జీర్ణించుకోలేకపోయాడు. గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలిపోయాడు.
Samayam Telugu తండ్రి మరణంతో కొడుకు గుండె ఆగింది


మెడ నరాలు పీకుతున్నాయని, గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే కుటుంబం ఇద్దరి పెద్ద దిక్కులను కోల్పోవడంతో వారి వేదన వర్ణనాతీతం. నాగేశ్వరరావుకు భార్య కుమారి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు మెకానిక్‌గా పనిచేస్తుండగా, చిన్నకొడుకు హరీష్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రికి కేన్సర్ సోకినట్టు కొద్ది రోజుల కిందట తెలియగానే అప్పటి నుంచి అతని బాధ్యతలు చూసుకుంటూ వేళకు మందులు అందిస్తూ కంటికిరెప్పలా కనిపెట్టుకున్నాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రితోపాటు ఆయన వెళ్లిపోయి తమను ఒంటరిని చేశాడని భార్యాపిల్లలు రోదిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.