యాప్నగరం

ఆస్తి కోసం దారుణం.. బండరాయితో కొట్టి తండ్రి, తమ్ముళ్ల హత్య

ఆస్తి కోసం నాగుర్‌కర్నూల్‌లో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్త సంబంధాన్ని మరిచిపోయి తండ్రితో పాటు ఇద్దరు తముళ్లను కిరాతకంగా హత్య చేశాడు.

TNN 29 Jan 2018, 10:12 pm
ఆస్తి కోసం ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్త సంబంధాన్ని మరిచిపోయి తండ్రితో పాటు ఇద్దరు తముళ్లను కిరాతకంగా హత్య చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని తమ వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆదివారం (జనవరి 28) ఉదయం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చంపేట సీఐ ఎస్‌.రామకృష్ణ కథనం ప్రకారం.. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన సామ భాస్కరయ్య(60)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అతడికి ముగ్గురు కుమారులు.
Samayam Telugu man kills father and 2 brothers in nagarkurnool
ఆస్తి కోసం దారుణం.. బండరాయితో కొట్టి తండ్రి, తమ్ముళ్ల హత్య


చెడు వ్యసనాలకు బానిసైన పెద్ద కుమారుడు మల్లేశ్‌.. జులాయిగా తిరుగుతూ కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు. అతడి వైఖరితో విసిగిపోయిన తల్లి కొన్నేళ్ల కిందటే పుట్టింటికి వెళ్లిపోయింది. మిగిలిన ఇద్దరు కుమారులు శ్రీశైలం(22), రామస్వామి(18) తండ్రితో పాటే ఉంటూ.. వ్యవసాయం చేస్తున్నారు.

వ్యవసాయ భూమిలో తన వాటా పంచి ఇవ్వాలని లేదా భూమి అమ్మి తన వాటా తాలూకూ డబ్బులు ఇవ్వాలని మల్లేశ్ కొద్ది రోజులుగా తన తండ్రి, తమ్ముళ్లపై ఒత్తిడి తెస్తున్నాడు. లేదంటే చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. వాళ్లు మాత్రం అతడి మాటలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు.

తండ్రి, తమ్ముళ్లను అడ్డు తొలగించుకుంటే తప్ప తనకు ఆస్తి రాదని భావించిన మల్లేశ్‌.. వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అదనుచూసి ఆదివారం తన ప్రణాళికను అమలు చేశాడు. పైపులు మార్చడానికి వేకువజామునే పొలం వద్దకు బయల్దేరిన చిన్న తమ్ముడు రామస్వామిని అనుసరించాడు. అతడి తలపై బండరాయితో మోది, కత్తితో పొడిచి చంపాడు.

చిన్న తమ్ముణ్ని వెతుక్కుంటూ వెళ్లిన శ్రీశైలాన్ని కూడా పొలంలో మాటువేసిన మల్లేశ్.. బండరాయితో కొట్టి హతమార్చాడు. తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికెళ్లి బోరు నడవడం లేదంటూ మాయమాటలు చెప్పి తండ్రిని కూడా పొలానికి తీసుకెళ్లి మట్టుబెట్టాడు. వేకువజామున 2 నుంచి 4 గంటల మధ్య ముగ్గుర్నీ హతమార్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.