యాప్నగరం

బీజేపీ ర్యాలి: కన్నాపైకి చెప్పు.. కావలిలో ఉద్రిక్తం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నెల్లూరు జిల్లాలో చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావలిలో కన్నాను లక్ష్యంగా చేసుకొని ఓ యువకుడు చెప్పు విసిరాడు. బీజేపీ కార్యకర్తలు అతణ్ని పట్టుకొని చితకబాదారు.

Samayam Telugu 4 Jul 2018, 8:22 pm
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నెల్లూరు జిల్లాలో చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావలిలో కన్నాను లక్ష్యంగా చేసుకొని ఓ యువకుడు చెప్పు విసిరాడు. బీజేపీ కార్యకర్తలు అతణ్ని పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనతో బీజేపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరోసారి అదుపుతప్పింది.
Samayam Telugu kanna


దాడికి పాల్పడగిన వ్యక్తిని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొట్టిపాటి మహేశ్వర రావుగా గుర్తించారు. అతడు టీడీపీ కార్యకర్త అని, ఆ పార్టీ నేతలు కావాలనే అతడితో దాడి చేయించారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే అతడు లారీ డ్రైవర్ అని.. తమ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతల డైరెక్షన్‌లోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొడుతూ.. బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని రాళ్ల దాడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గాలు దాడికి పాల్పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.

బీజేపీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి ఇప్పటికే డీజీపీని కలిసి చెప్పామని, గవర్నర్‌ను కూడా కలిశామని సోము తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి లాంటి నేతపై దాడి చేయాల్సిన అవసరం ఓ లారీ డ్రైవర్‌కు ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా టీడీపీ నేతల పనేనని, చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇవన్నీ జరుగుతున్నాయని విమర్శించారు.

మోదీపై ప్రజలకు వ్యతిరేకత ఎందుకు ఉంటుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాళ్లు విసరాల్సిన అవసరం వారికి ఎందుకు ఉంటుందని అన్నారు. ‘మోదీపై ప్రజలకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? మారుమూల గ్రామాలన్నింటికీ రోడ్లు వేయించినందుకా.. సోలార్ విద్యుత్‌తో వెలుగులు నింపినందుకా, మోదీ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రన్న బీమాగా మార్చి అమలు చేస్తున్నందుకా’ అని ఆయన ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.