యాప్నగరం

కేసీఆర్‌ను నిలదీయడం చేతకాదు కానీ..: తలసానికి అచ్చెన్న కౌంటర్

రెండు రోజుల కిందట విజయవాడలోని ఓ వివాహానికి హాజరైన తలసాని, ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.

Samayam Telugu 18 Feb 2019, 9:15 am
రెండు రోజుల కిందట విజయవాడలో పర్యటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తలసాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అంతే ఘాటుగా స్పందించి, ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగితే కేసీఆర్‌ను నిలదీయడం చేతకాని తలసానికి ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు.తెలంగాణలో 25 కులాలను బీసీ నుంచి తొలగించి ఓసీల్లో చేర్చితే నిలదీయడం చేతకాని తలసాని స్థానంలో తానుంటే రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకునేవాడ్నినని అన్నారు. తామేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోనని మంత్రి హెచ్చరించారు.
Samayam Telugu Acham_Naidu_7096


కాగా, ఇటీవల రెండుసార్లు ఏపీకి వెళ్లిన తలసాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. జనవరిలోనూ ఏపీలో పర్యటించిన తలసాని, తప్పకుండా తాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని ప్రకటించారు. అంతేకాదు, ఏపీలోని బీసీలకు తాను నాయకత్వం వహిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ కావడానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు. రెండు రోజుల కిందట విజయవాడలోని ఓ వివాహానికి హాజరైన తలసాని, ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆయన ఆరోపించారు.

అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీసిన ఆయన, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. మాట్లాడితే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని, ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.