యాప్నగరం

మా బాస్‌లు ఢిల్లీలో లేరు..: కేటీఆర్

మాది పేదల కోసం పని చేసే ప్రభుత్వం. మా బాస్‌లెవరూ ఢిల్లీలో లేరు. గల్లీలో ఉన్నారు..

TNN 20 Oct 2017, 1:52 pm
తమది పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని, హైదరాబాద్‌లో మౌలిక వసతుల పెంపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం (అక్టోబర్ 19) ఆయన నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బన్సీలాల్‌పేటలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలే తమకు బాస్‌లు అని చెబుతూ ఆయన.. తమ బాస్‌లు ఎక్కడో ఢిల్లీలో లేరని, ఇక్కడే ఉన్నారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu minister ktr inaugurates development works in hyderabad
మా బాస్‌లు ఢిల్లీలో లేరు..: కేటీఆర్


‘రాష్ట్రంలో 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన సాగింది. ఇంతకాలం ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనను తప్పుపడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయరు. టీఆర్‌ఎస్ పార్టీకి బాస్‌లు ఢిల్లీలో లేరు. మా బాస్‌లు గళ్లీల్లోనే ఉన్నారు. మీరే మా బాస్‌లు, మీ మాటే వింటాం’ అని కేటీఆర్ అన్నారు.

ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు రూ.77 కోట్లతో చర్యలు చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. రూ.130 కోట్ల వ్యయంతో రోడ్లను, నీరు నిలిచే ప్రాంతాలను బాగు చేయనున్నట్టు చెప్పారు. సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. మంచినీటి కోసం నగర శివార్లలో 56 పంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు.

అనంతరం.. అమీర్‌పేటలో పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. కనకదుర్గ ఆలయం వద్ద రహదారి నిర్మాణం పనులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌లో రూ.3.28 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద రూ. 3 కోట్లతో చేపట్టిన పార్కింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. పటేల్‌నగర్ శ్మశాన వాటికలో రూ.2 కోట్లతో చేపట్టనున్న పనులు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.