యాప్నగరం

చంద్రబాబుపై రోజా భర్త ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం దారుణమని సెల్వమణి వ్యాఖ్యానించారు.

Samayam Telugu 17 Nov 2018, 6:17 pm
ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా భర్త సినీ దర్శకుడు సెల్వమణి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని సెల్వమణి, చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం ఏంటంటారా..! వైసీపీ శనివారం చిత్తూరు జిల్లా నగరిలో ఓ సభ నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ఆ సభలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం దారుణమన్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేవంటూ ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu RK Selvamani


2004లో తాను చంద్రబాబు అభిమానినని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఒకప్పటి చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రాబాబు నిజ స్వరూపం బయటపడిందన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచిన 20కి పైగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీలోకి కలుపుకున్నారని విమర్శించారు. తనకు లొంగని వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు ఏపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందంటూ అభిప్రాయపడ్డారు.

మై ఎమ్మెల్యే యాప్‌ను ప్రారంభించిన రోజా
రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు టీడీపీ ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలోనే ‘మై ఎమ్మెల్యే’ యాప్‌ను రోజా ప్రారంభించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఈ యాప్‌ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చునని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.