యాప్నగరం

మోత్కుపల్లి ‘గవర్నర్’ ప్రచారం కలిసొచ్చిందిలా!

తెలంగాణ ప్రాంత టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ కాబోతున్నారనే వార్తలు ఆలేరు జనం సమస్యను తీర్చడానికి ఉపయోగపడ్డాయి.

TNN 14 Oct 2016, 3:18 pm
తెలంగాణ ప్రాంత టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ కాబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన గవర్నర్ కావడం ఖాయమంటూ పతిక్రల్లో వార్తలొచ్చాయి కూడా. ఈ వార్తలు, ప్రచారం కలిసి ఓ ప్రజా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడ్డాయి. అదేంటంటే..
Samayam Telugu mothkuaplli governor news helped to aleru people
మోత్కుపల్లి ‘గవర్నర్’ ప్రచారం కలిసొచ్చిందిలా!

ఆలేరు పట్టణం మీదుగా రైల్వే ట్రాక్ వెళ్తుంది. దీంతో ఈ పట్టాల మీదుగా రైలు ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగానే రైల్వే శాఖ పట్టాలు దాటేందుకు వీల్లేకుండా ప్రహరి గోడ కట్టేసింది. దీంతో రైల్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలంటే కనీసం అర కిలోమీటరు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టూవీలర్ల మీద వెళ్లే వారికి ఫర్వాలేదు కానీ, నడుచుకుంటూ అంత దూరం వెళ్లాలంటే జనాలకు ఇబ్బందిగా మారింది. దీంతో కాలి నడకన వెళ్లే వారి సౌలభ్యం కోసం ఆ గోడ కూల్చాలని ఆందోళన మొదలైంది. దీక్షలు ప్రారంభించిన స్థానికులు మోత్కుపల్లిని ఆహ్వానించారు. ఆ దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయన తనదైన స్టయిల్లో మాట్లాడారు. పది రోజుల్లో ఆ గోడను కూలగొట్టేలా చేస్తానంటూ ప్రతిన బూనారు.

మాటివ్వడమే కాదు.. వెంటనే రైల్వే జీఎంకు ఫోన్‌ చేసి గోడను తొలగించాలని కోరారు. పది రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. ఇక లాభం లేదనుకొని ఆయన జీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఓకే అయ్యిందని ఆ రోజే పత్రికల్లో వార్తలొచ్చాయి. దీంతో మోత్కుపల్లి వెళ్లగానే జీఎం ఎదురొచ్చి మరీ స్వాగతం పలికారు. ఆయన చెప్పింది సావధానంగా విని, గోడను కూల్చేందుకు ఆయన వెంట ఇద్దరు అధికారులను ఇచ్చి పంపారు. మోత్కుపల్లి గవర్నర్‌ కాబోతున్నారంటూ వచ్చిన వార్తలు ఆలేరు జనానికి ఈ రకంగా ఉపయోగపడ్డాయి. గవర్నర్‌ కాకముందే మోత్కుపల్లి ఇలా ప్రజల కోసం పాటుపడుతున్నాడంటే.. ఆ పదవి వచ్చాక జనం కోసం ఇంకెంత కృషి చేస్తాడోనని ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు తెగ సంబరపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.