యాప్నగరం

ఆరోగ్య శ్రీ నా ఆలోచనే.. జగన్ మాట తప్పారు, వైఎస్‌ డ్రీమ్ గురించి మాట్లాడరేం?: మంద కృష్ణ

ఆరోగ్యశ్రీ పథకం నా ఆలోచనే, గతంలో రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. వైఎస్ కలను జగన్ నెరవేర్చడం లేదు. సీఎం మాట తప్పారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

Samayam Telugu 19 Jul 2019, 12:48 pm
వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ తన ఆలోచన నుంచే పుట్టిందని మందకృష్ణ మాదిగ చెప్పారు. పాదయాత్ర సమయంలో అనార్యోగానికి గురైన వైఎస్ హాస్పిటల్‌లో చేరినట్టు.. ఆ సమయంలో అక్కడికొచ్చిన పిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టినట్టు యాత్ర సినిమాలో చూపించారు. కానీ వాస్తవానికి జరిగింది వేరని మంద కృష్ణ చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మంద కృష్ణ.. వైఎస్ చనిపోవడానికి 20 రోజుల ముందు అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్య శ్రీ గురించి అసలు విషయం చెప్పారన్నారు.
Samayam Telugu jagan aarogyasri


‘‘ఆరోగ్య శ్రీ పథకం అవినీతిమయంగా మారిపోయిందని చంద్రబాబు విమర్శించగా.. రాజశేఖర రెడ్డి స్పందిస్తూ.. గుడ్డు మీద ఈకలు పీకడం కాదు.. నీ హయాంలో ఉచితంగా ఒక్క ఆపరేషన్ అయినా చేయించావా? అని బాబును ప్రశ్నించారు. పథకంలో లోపాలుంటే సరిచేసుకుందాం. అంతేగానీ మంచి పథకాన్ని పట్టుకొని పథకమే బాగోలేదంటే ఎలా అని అడిగారు. నువ్వు చేసిందేమీ లేదు, నేను చేసిందేమీ లేదు. నాకు ఆరోగ్య శ్రీ ఆలోచన తనకు రావడానికి ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ గుండె జబ్బుల ఉద్యమం నడపడమే కారణం. మాట్లాడిన 20 నిమిషాల్లో పదిసార్లు నా, ఎంఆర్పీఎస్ పేరును వైఎస్ ప్రస్తావించారు. అసెంబ్లీ సాక్షిగా ఇది రికార్డయ్యింది’’ అని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఆరోగ్య శ్రీని మధ్యతరగతికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్.. హాస్పిటల్ ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని చెబుతున్న వేళ.. మంద కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

రాజశేఖర రెడ్డిలో ఉన్న నిబద్ధతలో 10 శాతం కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌లో కనిపించలేదంటూ... ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన మాట తప్పారన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానికి లేఖ రాసిన జగన్.. సీఎం అయ్యాక ఆ విషయమై స్పందించడం లేదన్నారు.

వీరప్ప మొయిలీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి తాను వెళ్లానని మంద కృష్ణ మాదిగ చెప్పారు. అదే సమయంలో అనంతపురం ఎంపీ వెంకట్రామిరెడ్డితో కలిసి అక్కడకు వచ్చిన జగన్.. నా వినతి పత్రం మీద సంతకం చేయడంతోపాటు వెంకట్రామిరెడ్డితోనూ సంతకం చేయించారన్న ఆయన.. ఎస్సీ వర్గీకరణ మా నాన్న కల అని జగన్ అప్పుడు చెప్పారన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు నోరు మెదపడం లేదని, తమ విషయంలో జగన్ మాట తప్పారని మంద కృష్ణ ఆరోపించారు. మిగతా విషయాల్లోనూ జగన్ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.