కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నాగం తనయుడు దినకర్ రెడ్డి(46) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా సతమతమవుతున్న దినకర్ రెడ్డి అక్టోబర్ 4న జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న దినకర్ రెడ్డి గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. దినకర్ మృతితో నాగం జనార్దన్రెడ్డి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దినకర్ మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దినకర్ రెడ్డి తండ్రి నాగం జనార్దన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నాగర్కర్నూల్ నుంచి పోటీచేసిన దినకర్.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కుమారుడి కోసం తన సీటును వదులుకున్న నాగం మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.
నాగం జనార్దన్ రెడ్డి ఇంట విషాదం
దినకర్ మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు హైదరాబాద్లోని ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
Samayam Telugu 11 Oct 2018, 11:45 pm