యాప్నగరం

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..?!

లెక్క ప్రకారం చూసుకుంటే, ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ

Samayam Telugu 30 Apr 2018, 12:56 pm
నాలుగేళ్ల తర్వాత తమ ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ ఇది.. అని అంటోంది తెలుగుదేశం పార్టీ. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లా చాలా సభలు, సమావేశాలు జరిగాయి. అయితే అవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినవి. టీడీపీ అధినేత చంద్రబాబు వివిధ సభలూ, సమావేశాల్లో పాల్గొన్నా, ఇటీవల ఒక రోజు దీక్ష కూడా చేసినా, అవన్నీ కూడా ప్రభుత్వ ఏర్పాట్లతో జరిగినవే. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సొంత ఏర్పాట్లతో తిరుపతిలో సభ నిర్వహిస్తోంది. ఈ సభతో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
Samayam Telugu ap2


లెక్క ప్రకారం చూసుకుంటే, ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. పోలింగ్‌కు కూడా సమయం దగ్గరపడుతుంది. అయితే ఏపీలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల ముచ్చట వినిపిస్తుండటం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ ఆలోచన చేస్తుండవచ్చు.. అని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం అధినేత తమ పార్టీని ఎన్డీయే నుంచి బయటకు తీసుకువచ్చారు. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ తీరును ఎండగడుతున్నారు. ఇదే మూడ్‌లో బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రత్యేకించి కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి ఏపీ రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.

ఒకవేళ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే, చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడితే దేశమంతా ఆ పార్టీపై వ్యతిరేకత ఉన్నట్టే అని, ఇప్పటికే బీజేపీకి వ్యతిరేక గళమెత్తిన చంద్రబాబు నాయుడు దాన్ని అదునుగా తీసుకుని ఎన్నికలకు వెళ్లవచ్చని విశ్లేషిస్తున్నారు.

అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇక జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటోంది. ప్రస్తుతం వైకాపా అధినేత జగన్ పాదయాత్రలో ఉన్నారు. జగన్‌ ఇంకా ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కాలేదని, ఇక పవన్ పరిస్థితి కూడా ఇంకా మొదట్లోనే ఉంది కాబట్టి.. ముందస్తు ఎన్నికలతో వారిని ఎదుర్కొనడం సులభం అవుతుందనే మాటను కూడా వినిపిస్తున్నారు విశ్లేషకులు. ఏదేమైనా బాబు తదుపరి రాజకీయం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.