యాప్నగరం

YS Jagan: కొత్త కాన్వాయ్ సిద్ధం.. నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నవ్యాంధ్రకు నయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌కు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. 6 అధునాతన వాహనాలతో కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు.

Samayam Telugu 24 May 2019, 10:39 pm
వ్యాంధ్రకు నయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌ కోసం అధికారులు ప్రత్యేక కాన్వాయ్‌ను సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న వైసీపీ అధినేత నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. జగన్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం (మే 24) ఉదయం ఆ ప్రాంతాన్నంతా మెటల్‌ డిటెక్టర్లు, డాగ్‌ స్క్వాడ్‌‌తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.
Samayam Telugu convoy


కొత్త ముఖ్యమంత్రి కోసం సరికొత్త కాన్వాయ్‌ సిద్ధమైంది. 6 అధునాతన స్ట్రామ్ వాహనాలతో జగన్‌కు కాన్వాయ్ సిద్ధం చేశారు. అధునాతన సౌకర్యాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి జగన్‌ నివాసానికి చేరుకుంది. ‘AP 18P 3418’ నంబర్‌తో ఈ కొత్త వాహనాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ) రంగంలోకి దిగి జగన్‌ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన వైఎస్ జగన్ మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష భేటీ ఉంటుంది. పార్టీ నేతగా జగన్‌ను ఎన్నుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ విచ్చేసి.. గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు.

మరోవైపు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌ను కలిసి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.