యాప్నగరం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు మరింత ఆలస్యం.. కారణం ఇదే!

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టిసారించారు. ఇందుకు రెవెన్యూ శాఖ అధికారులు ముమ్మర కసరత్తు ప్రారంభించారు.

Samayam Telugu 9 Jul 2019, 11:01 am
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై మరో వారంలో స్పష్టత రానుంది. ఎన్నికలను ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న అంశంపై సీఎం జగన్‌ స్పష్టతనివ్వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై వైసీపీ ముఖ్య నేతల బృందం అధ్యయనం చేసి ఆయనకు నివేదిక అందజేసినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించడానికే ఆ నివేదికలో మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రప్పించిన సమాచారాన్నీ సీఎం క్రోడీకరిస్తున్నారు. వీటి ఆధారంగా స్థానిక ఎన్నికలపై ముఖ్యమంత్రి వారంలో స్పష్టతనివ్వనున్నారని వైసీపీకి చెందిన ఓ ముఖ్యనేత తెలియజేశారు. మున్సిపల్ ఎలక్షన్లు వెంటనే నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రకటన జులై నెలాఖరులోగా వెలువడుతుందని భోగట్టా. పంచాయతీ ఎన్నికల విషయంలో రిజర్వేషన్ల అంశం పెండింగ్‌లో ఉన్నందున దీనిపై చర్చించి తర్వాత నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది.
Samayam Telugu ap


కాగా, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అప్పటికే ఎన్నికైన జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించినట్టు సమాచారం. జిల్లాల విభజన ప్రక్రియలోనూ సాంకేతికంగా జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించడంలో భౌగోళికంగానూ ఇబ్బందులున్నాయని అధ్యయన బృందం దృష్టికి వచ్చింది.

నాలుగు జిల్లాల్లో విస్తరించిన అరకు పార్లమెంటును జిల్లాగా చేస్తే అది ఇటు తెలంగాణ సరిహద్దు నుంచి అటు ఒడిశా సరిహద్దు వరకు ఉంటుంది. అరకు నియోజకవర్గ కేంద్రం నుంచి సుమారు 360 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా దీని పరిధిలో ఉన్నాయనే అంశం చర్చకు వచ్చింది. మరో నాలుగు నుంచి ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్టు గుర్తించారు. అరకు, శ్రీకాకుళం, బాపట్ల, నంద్యాల, ఏలూరు, రాజంపేట, తిరుపతి లాంటి లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయడంలో భౌగోళిక, సాంకేతిక సమస్యలు కూడా ఉన్నట్లు ఆ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంత త్వరగా తేలే వ్యవహారం కాదని తేల్చేశారట. రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడమే మంచిదని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న అధ్యయన బృందం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.