యాప్నగరం

నంద్యాల బైపోల్.. ఆయనకు కొత్త ఊపు!

నంద్యాల ఉప ఎన్నికకు ముందు ప్రకటించినట్టుగానే టీడీపీ

TNN 5 Sep 2017, 9:58 am
నంద్యాల ఉప ఎన్నికకు ముందు ప్రకటించినట్టుగానే టీడీపీ సీనియర్ నేత ఫరూక్ ను శాసనమండలి చైర్మన్ గా నియమిస్తున్నట్టుగా ప్రకటన చేశారు ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మండలి చైర్మన్ గా వ్యవహరించిన చక్రపాణి పదవీకాలం ఇటీవలే ముగియడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యం అయ్యింది. ముందుగా ఈ పదవిని కర్నూలు జిల్లాకే చెందిన శిల్పా చక్రపాణి రెడ్డికి ఆఫర్ చేశారు చంద్రబాబు. శిల్పా సోదరులు తెలుగుదేశాన్ని వీడని పక్షంలో చక్రపాణి రెడ్డికి ఆ పదవిని ఇస్తానని బాబు హామీ ఇచ్చారు.
Samayam Telugu nmd farooq will be new chairman for ap council
నంద్యాల బైపోల్.. ఆయనకు కొత్త ఊపు!


అయితే వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో మైనారిటీ నేత ఫరూక్ కు నంద్యాల ఉప ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు చంద్రబాబు. అంతేగాక.. పార్టీని నంద్యాల్లో గెలిపిస్తే.. మండలి చైర్మన్ పదవిని కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫరూక్ ను మండలి చైర్మన్ గా నియమిస్తున్నట్టుగా బాబు ప్రకటన చేశారు.

నంద్యాల రాజకీయాలకు సీనియర్ అయిన ఫరూక్ ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పని చేసిన అనుభవం కలవారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన, 89లో ఓడారు. 1994, 99లో నంద్యాల అసెంబ్లీ సీటు నుంచి గెలిచారు. 2004లో నంద్యాల్లోనే ఓడిపోయారు. భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫరూక్ పొలిటికల్ కెరీర్ కు కొత్త ఊపును ఇచ్చింది. ఇప్పుడు మండలి చైర్మన్ ను చేసింది. నంద్యాల రాజకీయ పరిణామాలే ఫరూక్ కు ఈ పదవులు తెచ్చిపెట్టాయని... విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.