యాప్నగరం

రెడ్డి, నాయుడు.. తోకలు తొలగించుకునే ధైర్యం ఉందా?

కష్టాలున్నంత మాత్రాన తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను వదులుకోమని.. చేనేత రంగాన్ని కూడా అలాగే వదులుకోవద్దని పవన్ సూచించారు.

Samayam Telugu 4 Dec 2018, 1:56 pm
సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని సహించలేకే తాను సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి పాతికేళ్ల మంచి భవిష్యత్ అందిచడమే తన లక్ష్యమని చెప్పారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ మంగళవారం ధర్మవరంలో చేనేత కార్మికులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వారితో కలిసి కూర్చుని సమస్యలు తెలుసుకున్నారు.
Samayam Telugu PAWANKALYAN1


అనంతరం మాట్లాడుతూ... తాను చీరాలలో నివసించినప్పుడు చేనేత కార్మికుల సమస్యలు ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఇతర కుల వృత్తుల కంటే చేనేతలో శారీరక శ్రమ అధికంగా ఉంటుందన్నారు. కష్టాలున్నంత మాత్రాన తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను వదులుకోమని.. చేనేత రంగాన్ని కూడా అలాగే వదులుకోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని.. అంతా అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న నాయకులకు ప్రజల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చేనేత కళాకారుల కష్టాలను తెలుసుకునేందుకు జనసేన పార్టీ చేనేతకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే చేనేత కార్మికుల సమస్యలన్నింటినీ తీరుస్తామని పవన్ హామీ ఇచ్చారు. చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానన్నారు. ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారుచేసి దేశం గర్వంచేలా చేసిన చేనేత కళాకారులు నేడు ఆకలి, అఫ్పులతో చనిపోతున్నారంటే సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలు మారినా వారి తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో కార్ రేసింగ్, బోట్ రేసింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం చేనేత కార్మికుల కష్టాలు తీర్చలేదా? అంటూ నిలదీశారు.

సమాజంలో కుల నిర్మూలన జరిగితేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతలు తమ కులాన్ని సూచించే పదాలను పేర్ల నుంచి తొలగించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను చిన్నప్పుడే ఎస్సీ, బీసీ హాస్టల్ అంటూ వేరుచేస్తే ఇక కుల నిర్మూలన ఎప్పుడు సాధ్యమవుతుందన్నారు. జనసేన అధికారంలోకి రాగానే కులాల వారీగా హాస్టళ్లను తొలగించి కామస్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు కేంద్రం అంటే భయమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారేమోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలు రక్తపాతం, హింసతో పరిష్కారం కావని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని పవన్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.