యాప్నగరం

నేడు కమ్యూనిస్టులతో పవన్ భేటీ.. ఉద్యమ కార్యాచరణపై చర్చ!

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేస్తామని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 4 Apr 2018, 9:13 am
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేస్తామని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా వామపక్ష పార్టీలతో జనసేనాని పలుసార్లు భేటీ అయ్యారు. తాజాగా విభజన హామీల ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై వివిధ పక్షాలతో విజయవాడలో పవన్ కల్యాణ్ బుధవారం సమావేశమవుతారు. ఇందులో భాగంగా కమ్యూనిస్టు పార్టీల నాయకులతోపాటు మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. విజయవాడలోని జనసేన తాత్కాలిక కార్యాలయంలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణను కూడా పవన్‌కల్యాణ్‌ వెల్లడిస్తారని పేర్కొంటున్నారు. జనసేన ఆవిర్భావ సభ తర్వాత ఇప్పటికే కమ్యూనిస్టులతో పవన్ రెండుసార్లు సమావేశమయ్యారు.
Samayam Telugu పవన్ కల్యాణ్


పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాతే ప్రత్యేక హోదాపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని గతంలో ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు పరీక్షలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇక కార్యాచరణకు దిగాలనే ఆలోచనతో ఉన్నారు. పార్టీ పరంగానూ పవన్‌ కొన్ని ముఖ్య సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జనసేనాధినేత విజయవాడలోనే ఉంటారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మధ్య జోరుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీకి అన్ని చేశామని బీజేపీ చెబుతుంటే, ఏం చేశారో చెప్పాలని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై స్పందించిన పవన్ టీడీపీ, బీజేపీ మళ్లి పాతపాటే పాడుతున్నాయని విమర్శించారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదు.. దాన్ని సాధించుకునే స్థితిలో టీడీపీ లేదనే విషయం ప్రజలకు మరోమారు అర్థమైందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.