యాప్నగరం

‘సమస్యల పరిష్కారానికి నా దగ్గర మంత్రదండం ఉంది’

రాజకీయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురంలో జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. తొలిరోజు అనంతపురం పట్టణంలో పర్యటించిన ఆయన రెండో రోజు కదిరిలో పర్యటిస్తున్నారు.

TNN 28 Jan 2018, 3:30 pm
రాజకీయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురంలో జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. తొలిరోజు అనంతపురం పట్టణంలో పర్యటించిన ఆయన రెండో రోజు కదిరిలో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం అనంతపురం పట్టణం నుంచి బయలుదేరిన పవన్, కదిరి చేరుకుని ముందుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సమస్యలపై చర్చించేందుకు స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..అన్ని సమస్యలకు తన దగ్గర మంత్రదండం ఉందని, ఓపికతో పరిష్కరించుకుందామని సూచించారు. ‘కదిరి సమస్యల’పై మహిళలతో ఇష్టాగోష్టిలో పవన్ మాట్లాడారు.
Samayam Telugu pawan kalyan political tour pawan meeting at kadiri
‘సమస్యల పరిష్కారానికి నా దగ్గర మంత్రదండం ఉంది’


ఒక సమస్యను పరిష్కరించాలంటే, ప్రెస్ మీట్ పెట్టి, లేదా రెండు మూడు ముక్కలు మాట్లాడితే పరిష్కారం దొరకదని, అదే విషయం తనకూ తెలుసని అన్నారు. ఒక సమస్యకు పరిష్కారం లభించాలంటే అందుకు చాలా సహనం కావాలని, చాలా మందిని ఒప్పించి వారి మందిని భాగస్వామ్యం చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడతానని పవన్ హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికులకు సంబంధించిన పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, గతంలో తాను దుబాయ్‌లో పర్యటించినప్పుడు ఏపీకి చెందిన వలస కార్మికులు తనను కలిసి వాపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

గల్ఫ్‌లో మోసపోయిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందని, అదే మాదిరి ఏపీలో కూడా ఏర్పాటు చేయాలని తాను కోరుతున్నానని పవన్ పేర్కొన్నారు. ఈ సమస్యకు సినిమాల్లో లాగా రెండున్నర గంటల్లో పరిష్కారం లభించదని, అధికారులు, రాజకీయ యంత్రాంగం ద్వారా వీటిని పరిష్కరించుకుందామని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను సమర్పించే లేఖలో ఈ సమస్యను కూడా ప్రస్తావిస్తానని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.