యాప్నగరం

చూస్తూ ఊరుకోం.. చొక్కా పట్టుకుని నిలదీస్తాం: పవన్

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గూంఢాయిజం, భూకబ్జాలు పెరిగిపోతాయని ఆనాడు తెలుగుదేశం పార్టీ తనకు చెప్పిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

Samayam Telugu 22 May 2018, 7:44 pm
ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గూంఢాయిజం, భూకబ్జాలు పెరిగిపోతాయని ఆనాడు తెలుగుదేశం పార్టీ తనకు చెప్పిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి తోడు తాను హైదరాబాద్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భూ కబ్జాలు చూసి బాధేసేదని, అందుకే రాష్ట్రం విడిపోయాక టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పారు. కానీ ఈనాడు టీడీపీ నేతలు కూడా భూకబ్జాలు చేస్తున్నారని, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తు్న్నారని, దోపిడీలకు పాల్పడుతున్నారని, ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఈ చర్యలను జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని, చేతులు కట్టుకొని కూర్చోదని హెచ్చరించారు. ‘తిరగబడతాం.. చొక్కాపట్టకుని నిలదీస్తాం.. నిలదీస్తాం..’ అంటూ పవన్ చాలా ఆవేశంగా మాట్లాడారు.
Samayam Telugu Pawan

జనసేన పోరాట యాత్రలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకున్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మేం ఎవ్వరికీ భయపడం. జనసైనికులను ముందుండి నడిపించే జనసైనికుడిని నేను. మీరు జనసైనికులైతే నేనూ జనసైనికుడినే. జనసేనానిని కాదు. ముందు వరుసలో నడిచే జనసైనికుడిని అంతే మీకు నాకు తేడా. మేం కేంద్ర ప్రభుత్వాలకు భయపడం. ముఖ్యమంత్రులకు భయపడం. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు భయపడం. దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకునే తరం కాదు. ఇది సరికొత్త తరం. పదునెక్కిన తరం. యువతరం. కత్తులునూరే తరం. భయపడం.. బయటికొచ్చి చొక్కా పట్టుకుని నిలదీస్తాం. ప్రజాక్షేమం కోసం మనం జనసేన పార్టీని స్థాపించాం’ అంటూ యువతను ఉత్తేజపరిచే విధంగా పవన్ మాట్లాడారు.
చాలా బలమైన ప్రధాన పార్టీలను జనసేన ఎదుర్కొంటూ వచ్చిందని, అది ఒక్క పవన్ కళ్యాణ్ బలం కాదని.. ఇది మన బలం అని ప్రజలనుద్దేశించి పవన్ అన్నారు. ‘పలాసలో 19 ఏళ్ల కుర్రాడిపై తెలుగుదేశం కౌన్సిలర్ దాడిచేస్తే దాన్ని తట్టుకోలేక ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితం కోసం ఎన్నో కలలు కన్న ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు నేను మామూలు మనిషిగా ఉండలేకపోయాను. చాలా బాధేసింది. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే.. ఒక 19 ఏళ్ల బిడ్డ ప్రాణాలను నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ ఉసురు మీకు తగులుతుంది. ఆ తల్లి కడుపుకోత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు పేరుపేరున ప్రతి ఒక్కరికీ తగులుతుంది’ అని తన అభిమాని ఆత్మహత్యపై పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.