యాప్నగరం

సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు.. నేను రెచ్చగొడితే రాష్ట్రం అగ్నిగుండమే: పవన్

మనలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా.. మనలో సాహసం ఉంటే రౌడీ మూకలు ఏం చేస్తాయి.. ఆకు రౌడీలను, గాలి రౌడీలను 16 ఏళ్ల వయసు నుంచే చూస్తున్నా..

Samayam Telugu 27 Sep 2018, 12:01 am
రౌడీలు చట్టసభలకు వెళ్లి పిచ్చి వాగుళ్లు వాగితే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా జనసేన పోరాటయాత్రలో భాగంగా.. దెందలూరులో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని నిప్పులు చెరిగారు. తన సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దన్నారు జనసేనాని.. జనసేన పోరాట యాత్రకు వస్తుంటే సభ ఎలా పెడతారని కొందరి నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. గూండాయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబడ్దార్ అంటూ చింతమనేనిని హెచ్చరించారు.
Samayam Telugu Pawan


మనలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా.. మనలో సాహసం ఉంటే రౌడీ మూకలు ఉంటే ఏం చేస్తాయంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు పవన్. 19 ఏళ్లకే సాయుధ పోరాటానికి సిద్ధమయ్యానని.. ఆకు రౌడీలను, గాలి రౌడీలను 16 ఏళ్ల వయసు నుంచే చూస్తున్నానన్నారు. తాను ప్రభుత్వానికి ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చిందో గతంలోనే చెప్పానని.. సీఎంను కలిసి బలమైన లా అండర్ ఆర్డర్ కావాలని.. ఆడపడుచులకు భద్రత కల్పించాలని కోరానన్నారు. రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని.. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

ఇలా రౌడీయిజం చేసే వ్యక్తిని విప్‌గా ఎలా నియమించారని.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు పవన్. ఈ సందర్భంలో చింతమనేనిపై ఉన్న కేసుల వివరాలను చదివి వినిపించారు. తెలంగాణలో గడీల పాలన ఉండేదని.. వారు తన మనుషుల్ని మాత్రమే.. మనుషులు అనుకునేవారని.. వారి చిత్ర హింసలు భరించలేక ప్రజలే వారిని చంపి ఉప్పు పాతరేశారని గుర్తు చేశారు. ఇలా భయబ్రాంతులకు గురిచేసేవారికి ఎప్పటికైనా ప్రజాగ్రహం తప్పదని.. జనాలే తరిమికొడతరన్నారు.

చింతమనేనిపై చంద్రబాబు యాక్షన్ తీసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు జనసేనాని. న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే రౌడీ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటారని.. 27 కేసులున్న ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఓ దళిత వ్యక్తిపై దాడి చేస్తే పట్టించుకోలేదని.. కేసు కూడా నమోదు చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యేపై సీఎం చర్యలు తీసుకుంటారా.. లేక తామే చర్య తీసుకోమంటారా అని ప్రశ్నించారు. తాను రెచ్చగొట్టాలంటే అగ్నిగుండం సృష్టించగలనన్నారు.

అమాయకులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని.. జనం కోసం జన సైనికులు ఉన్నారన్నారు పవన్. రాష్ట్రంలో బలమైన రాజకీయ వ్యవస్థ రావాలని.. జనసేన ఈతరం యువత పార్టీ అన్నారు. రాష్ట్రంలో సింగపూర్ తరహా రాజధాని కాదు.. సింగపూర్ తరహా పాలన కావాలన్నారు. ఇకపై మా సహనాన్ని చేతగాని తనం అనుకుంటే పొరపాటని.. సహనాన్ని పక్కన పెడితే ప్రజలు తన్ని.. తన్ని తరిమేస్తారన్నారు.

తన జీవితంలో డబ్బును చూశానని.. ఇప్పుడున్న నేతల్లా దోచుకునే మనస్తత్వం కాదన్నారు పవన్. జనసేన పార్టీకి నిర్మాణమే లేదని కొందరు విమర్శిస్తున్నారని.. అది ఆవేశంతో చేసే పని కాదన్నారు. జనసేనను ఇలాంటి రౌడీల చేతుల్లో కాకుండా.. యువత చేతులో పెడతానన్నారు. యువతరాన్ని మేలుకొలపడానికి వచ్చానని.. అధికారం, సీఎం పదవి తనకు ముఖ్యం కాదని.. జన సైనికుల గుండెల్లో ఇచ్చే పదవే ముఖ్యమన్నారు. అమాయకులు, తమవాళ్ల జోలికొస్తే ఊరుకోనని.. శాంతి కోసం కత్తి పట్టుకోవడానికి సిద్ధమన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు పవన్.

మీడియాపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. ఎవరు ఎవరితో పడుకున్నా తానే సమాధానం చెప్పాలని.. తన బతుకిలా అయిపోయింది అని జనసేన అధినేత అన్నారు. ‘మీరూ.. మీరూ పడుకుంటే నేనేం చేయాలన్నారు’.దీనిపైన ప్రోగ్రాంలు, ఆరు నెలలు.. ఏడాది నడిపిస్తూ టీఆర్‌పీలు పెంచుకుంటున్నారని మండిపడ్డారు. మరి రౌడీల గురించి ప్రోగ్రాం ఎందుకు చేయరని ప్రశ్నించిన ఆయన.. అలాంటి వాళ్లంటే మీడియాకు భయమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.