యాప్నగరం

ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నాకే సీఎం అవుతా: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎక్కడికెళ్లినా కార్యకర్తలు, అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Samayam Telugu 18 May 2018, 9:28 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎక్కడికెళ్లినా కార్యకర్తలు, అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం విశాఖపట్నంలోని గంగవరం పోర్టు వద్ద ఇదే కనిపించింది. అయితే జనసేవకుల నినాదాలకు పవన్ స్పందించారు. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రిని కాలేనని.. ప్రజల సమస్యలు అర్థం చేసుకున్న తర్వాతే సీఎంని అవుతానని చెప్పారు. 2019 ఎన్నికల్లో మీకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉన్న వారికే ఓటేసి ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. మీకు న్యాయం చేసేది జనసేన అని నమ్మితే ఆ పార్టీకే ఓటు వేయండి అని పవన్ అన్నారు.
Samayam Telugu Pawan_Gangavaram1

శ్రీకాకుళం నుంచి పోరాట యాత్రను ప్రారంభించడానికి గురువారం విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్.. శుక్రవారం మధ్యాహ్నం గంగవరం వెళ్లి అక్కడి పోర్టు నిర్వాసితులను కలిశారు. పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గంగవరం ప్రజలు పడుతున్న బాధలు విని చలించిపోయారు. అక్కడి బాధితులను పరామర్శించారు. గంగవరం పోర్టు బాధితులను అండగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ఏనాడూ అభివృద్ధికి అడ్డుకాదని, అయితే ప్రజల ఆరోగ్యం అంతకంటే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంగవరం ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.
‘శ్రీకాకుళం నుంచి యాత్రను ప్రారంభించాలనుకున్నా. అయితే గంగవరం పోర్టు బాధితుల సమస్యలు తెలుసుకున్న తరవాత ఇక్కడికి వచ్చి నేరుగా మీతో మాట్లాడాలనిపించింది. పోర్టు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. కిడ్నీ, శ్వాసకోస వ్యాధుల బారిన పడ్డ వారి వేదన ఎవరినైనా కదిలిస్తుంది. పాలనా వ్యవస్థ ఏం చేస్తోంది. పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలపై పోరాడితే తుపాకీలతో కాల్చి చంపిస్తారా? బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. జనాన్ని ఇళ్ల నుంచి వెళ్లగొట్టే అభివృద్ధి ఎవరికోసం. పోర్టు కాలుష్యాన్ని ఆపలేకపోతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కానీ, ప్రజల ప్రాణాలతో ఆటలాడటం ధర్మం కాదు’ అని పవన్ మండిపడ్డారు.
గత ఎన్నికల సమయంలో గాజువాక వచ్చి టీడీపీ, బీజేపీలకు ఓటేయమని అడిగానని, ఆ పార్టీలు హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తానని కూడా చెప్పానని పవన్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీలు హామీలు నెరవేర్చలేదు కాబట్టే నిలదీసేందుకు వచ్చానని అన్నారు. పాలనలోకి వచ్చాక మాట ఇచ్చాం నిలబెట్టుకుందామనే ఆలోచన ఏ ఒక్కరికీ లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి తర్వాత రెవెన్యూ లోటు అంటూ సాకులు చెప్పి వాటిని పక్కనబెడితే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. అందరిలా మాట్లాడి వెళ్లిపోయేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, సమస్య పరిష్కారమయ్యే వరకు గ్రామ పెద్దలతో కలసి పోరాటం చేస్తానని గంగవరం నిర్వాసితులకు పవన్ హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.