ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడ్విట్లు సమర్పించారని ఆరోపిస్తూ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరామ కృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్రావుల ఎన్నికను రద్దు చేయాలని అందులో కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. అయితే, ఆయన ఈసీకి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తోట వాణి ఆరోపించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చినరాజప్ప అఫిడవిట్ దాఖలు చేశారనీ, 2007లో ఓబులాపురం గనుల క్వారీ వద్ద దౌర్జన్యానికి పాల్పడితే కేసు నమోదయ్యిందని అన్నారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండగా అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేసినందుకు ఆయనపై అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు చేశారని వివరించారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలపై చినరాజప్ప మాట్లాడుతూ.. తనపై కేసు ఉన్న విషయం తెలియదనీ, ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇక, ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం బలరామ కృష్ణమూర్తి ఎన్నిక కూడా చెల్లదంటూ హైకోర్టులో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. భార్య, వివాహం ద్వారా సంబంధీకులు, తనపై ఆధారపడి జీవించే వారి వివరాలను కరణం వెల్లడించలేదని ఆమంచి పేర్కొన్నారు. భార్య పేరును కరణం సరస్వతిగా చూపారని, కరణం బలరాం భార్య అయిన ప్రసూన వివరాల్ని ఫామ్-26లో పేర్కొనలేదని వివరించారు. వారికి ఓ కుమార్తె ఉందని విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల్లో తండ్రిగా కరణం బలరామ కృష్ణమూర్తి అలియాస్ కేబీఆర్కే మూర్తి పేరుందని తెలిపారు.
అలాగే గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మొత్తం ఐదు పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేశారని ఆరోపించారు. అంతేకాదు 4040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కేవలం 312 మాత్రమే చెల్లుబాటు అయినట్లు ఆర్వో ధ్రువీకరించారని, గిరిధర్రావుతో ఆయన కుమ్మక్కు అయ్యారని ఏసురత్నం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మొత్తం ఐదు పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేశారని ఆరోపించారు. అంతేకాదు 4040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కేవలం 312 మాత్రమే చెల్లుబాటు అయినట్లు ఆర్వో ధ్రువీకరించారని, గిరిధర్రావుతో ఆయన కుమ్మక్కు అయ్యారని ఏసురత్నం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.