యాప్నగరం

విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో అనుమానాలెన్నో!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

TNN 28 Jul 2017, 2:48 pm
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయటి నుంచి ఎవరైనా వచ్చి విక్రమ్‌పై హత్యాయత్నం చేసే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని రోడ్ నంబర్ 86లో ఉన్న విక్రమ్ గౌడ్ ఇంటికి ఒకే మెయిన్ గేటు ఉండటం, ఇంటి ప్రహారీ గోడ ఎత్తు కూడా 10 అడుగులు పైనే ఉండటంతో బయటి నుంచి ఎవరైనా రహస్యంగా ప్రవేశించే అవకాశంలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దానికి తోడు పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి ప్రధాన ద్వారంలో నుంచి బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు.
Samayam Telugu police suspects suicide in vikram goud gun fire case
విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో అనుమానాలెన్నో!


సంఘటన జరిగిన ఇంట్లో విక్రమ్, అతని భార్య షిఫాలీ మాత్రమే ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాల్పుల సమయంలో వీరితో పాటు ముగ్గురు పనివాళ్లు, ఔట్ హౌజ్‌లో సెక్యూరిటీ గార్డు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి హత్యాయత్నం జరిగి ఉండదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం వాళ్లకి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో విక్రమ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే విక్రమ్ గౌడ్‌కు అసలు లైసెన్స్‌డ్ గన్ లేదని అలాంటప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పిస్టోల్ ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచనలో పోలీసులు పడ్డారు. ఆ కోణంలోనే కేసును విచారణ చేస్తున్నారు.

మరోవైపు తన భర్తపై హత్యాయత్నం జరిగిందని విక్రమ్ భార్య షిఫాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే పోలీసులు మాత్రం షిఫాలీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన చోట సోఫా, ఫ్లోర్‌పై రక్తపు మరకలను తుడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో వాచ్‌మెన్‌, అతని భార్య, ఇంకో పనిమనిషితో పాటు భార్యాభర్తలు మాత్రమే ఉన్నారని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. క్లూస్ టీం, సీసీ ఫుటేజీల ఆధారంగా చేసుకుని విచారణ జరుపుతున్నామని, ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని మహేందర్‌ రెడ్డి తెలిపారు.

కాగా, విక్రమ్ గౌడ్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. భార్యతో కూడా ఈ మధ్య విబేధాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం విక్రమ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో విక్రమ్‌ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయన శరీరం నుంచి రెండు బుల్లెట్లను వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.