యాప్నగరం

నవ్యాంధ్ర అద్భుతం.. ఇంటింటికీ ‘ఫైబర్ నెట్’

నిజంగా ఇది అద్భుతమే. మూడేళ్ల క్రితం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్.. సాంకేతికత వినియోగంలో దూసుకుపోతోంది. పరిపాలన దగ్గర నుంచి ప్రజలకు అందించే సేవల వరకు ప్రతిదానిలోనూ సాంకేతికను వినియోగిస్తున్నారు.

TNN 27 Dec 2017, 11:14 am

నిజంగా ఇది అద్భుతమే. మూడేళ్ల క్రితం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్.. సాంకేతికత వినియోగంలో దూసుకుపోతోంది. పరిపాలన దగ్గర నుంచి ప్రజలకు అందించే సేవల వరకు ప్రతిదానిలోనూ సాంకేతికను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ సాధ్యంకాని ‘ఫైబర్‌గ్రిడ్‌’ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ సాకారం చేస్తోంది. ‘ఫైబర్‌ నెట్‌’ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా టీడీపీ ప్రభుత్వం ఈరోజు (డిసెంబర్ 27న) జాతికి అంకితం చేస్తోంది. ఒకేసారి 1.10 లక్షల ఇళ్లకు ఫైబర్‌ నెట్‌తో అనుసంధానించడంతోపాటు.. ఇళ్లవద్ద ఉన్న ప్రజలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా పలకరించనున్నారు.

Samayam Telugu president kovind to launch andhra fiber grid project here are the details
నవ్యాంధ్ర అద్భుతం.. ఇంటింటికీ ‘ఫైబర్ నెట్’


ఫైబర్ గ్రిడ్ ద్వారా మూడు సేవలు..
ఫైబర్ గ్రిడ్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు మూడు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫైబర్ నెట్‌తో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, 250 వరకు టీవీ చానళ్ల ప్రసారాల సదుపాయం అందుతుంది. అపరిమిత కాలింగ్, వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. కేవలం రూ.149లతో ఈ సౌకర్యాలు పొందడం విశేషం. దీంతో ప్రపంచంలో అత్యంత చౌక ధరకు ఇంటర్నెట్‌ను అందించే రాష్ట్రంగా ఏపీ నిలవబోతుంది. ప్రపంచంలో మరెక్కడా ఇంత తక్కువ ధరకు ఇన్ని సేవలు అందించే బ్రాడ్‌బ్యాండ్‌ వ్యవస్థ ఉండదని విశ్లేషకుల మాట. ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా తరవాతి దశలో వినియోగదారులకు 500 టెలివిజన్‌ ఛానెళ్లు అందించాలని ప్రభుత్వం చూస్తోంది.

15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్..
ఒకే కనెక్షన్‌తో మూడు ప్రధాన సేవలు, ఇతర అనుబంధ సేవలు కల్పించాలనే ఆశయంతో ఆగస్టు 2015న ‘ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ’ను ప్రారంభించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు తొలి దశను చంద్రబాబునాయుడు 2016 మార్చి 17న విశాఖలో ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును నేడు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఈ సేవలు అందనున్నాయి. వచ్చే ఏప్రిల్‌నాటికి 25 లక్షల కుటుంబాలకు ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తరించాలని ప్రభుత్వం చూస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.