తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన
వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు.
TNN 25 Aug 2016, 3:44 pm
కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శ్రావణ మాసంలో రోహిణి కార్తెని తలపిస్తున్నాయి. వాతావరణం తీవ్రంగా వేడెక్కిపోతోంది. వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పాడ్డాయని, వాటి వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా పుష్కలంగా ఉందట. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కలిస్తే వర్షాలే వర్షాలు. శుక్రవారం, శనివారం తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవాకశం కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం బాగా చల్లబడిపోయింది. బుధవారం అర్థరాత్రి దాటాక కొన్ని ప్రాంతాల్లో వానలు పడ్డాయి. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి జల్లుల కురిశాయి. ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి.