యాప్నగరం

ఏజీ ప్రకాశ్ రెడ్డి రాజీనామా వెనుక కారణాలివేనా?

అడ్వొకేట్ జనరల్ పదవికి ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేయడం వెనుక కారణాలేంటి..? ప్రభుత్వ తీరుతో ఆయన నొచ్చుకోవడంతోనే రాజీనామా చేశారని తెలుస్తుండగా.. అసలేం జరిగిందంటే..

Samayam Telugu 27 Mar 2018, 11:45 am
తెలంగాణ అడ్వొకేట్ జనరల్ డి. ప్రకాశ్ రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన రాజీనామా లేఖలో తెలిపారు. కానీ ప్రభుత్వ తీరుతో నొచ్చుకోవడం వల్లే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘హెడ్ ఫోన్స్’ గొడవలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu AG Prakash Reddy


ఆరు వారాలపాటు ఎన్నికలు నిర్వహిచొద్దని ఉత్తర్వులతోపాటు కోమటరెడ్డి అభ్యర్థన మేరకు అసెంబ్లీలో హెడ్ ఫోన్స్ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించబోయింది. కానీ వీడీయో ఫుటేజీ సమర్పిస్తామని మార్చి 19న ఏజీ ప్రకాశ్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం, స్పీకర్‌ అనుమతి తీసుకోకుండానే ఆయన న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. కానీ మాకు మరి కొంత టైం కావాలని మార్చి 22న అదనపు ఏజీ రామచంద్రరావు కోర్టును కోరారు. తిరిగి మంగళవారం కేసు విచారణకు వస్తోంది.

కాగా, కోర్టుకు వీడియో ఫుటేజీ ఇవ్వడానికి సర్కారు సిద్ధంగా లేదని సమాచారం. తమకు ముందుగా చెప్పకుండానే వీడియో ఇస్తామని న్యాయస్థానానికి ఏజీ మాట ఇవ్వడం పట్ల ప్రభుత్వ పెద్దలు ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాదు ఈ కేసు నుంచి ఏజీని పక్కనబెట్టి సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను రప్పించారు.

ఎమ్మెల్యేల కేసును హరీష్ సాల్వేకు అప్పగించాలన్న ప్రభుత్వ యోచనతో ఏజీ నొచ్చుకున్నారు. వీడియో ఫుటేజీ ఇవ్వడానికి సుముఖంగా లేని సర్కారు.. కేసును మరొకరికి అప్పగించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని తెలుస్తోంది. ఇక ఈ పదవిలో ఉండి లాభమేంటనే యోచనతోనే పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.

తమ ఎమ్మెల్యేలు విసిరిన హెడ్ ఫోన్ కారణంగా మండలి చైర్మన్ కంటికి గాయమే కాలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఒకవేళ గాయం కావడం నిజమే అయితే వీడియో ఫుటేజీ బయటపెట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. కానీ అధికార టీఆర్ఎస్ మాత్రం.. హెడ్‌ఫోన్స్ స్వామిగౌడ్ కంటికి తగులుతున్న వీడియోను బయటపెట్టలేదు. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

టీఆర్ఎస్ సర్కారు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిందని కాంగ్రెస్ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తుండగా.. ఏజీ ప్రకాశ్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు వారికి ఆయుధంలా మారింది. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన అదనపు ఏజీని ఏజీగా ప్రమోట్ చేయడానికి ప్రకాశ్ రెడ్డిని పథకం ప్రకారం తప్పుకునేలా చేశారనే ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.