యాప్నగరం

Janasena: గ్రామస్థాయిలో జనసేన బలోపేతానికి ‘రెడ్ రెవల్యూషన్’ కృషి

గ్రామాల్లోని సమస్యలను గోడలపైకి ఎక్కించడంతో రెడ్ రెవల్యూషన్ ప్రయాణం మొదలైంది. నిడదవోలు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించిన కస్తూరి నాని.. అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

Samayam Telugu 19 Nov 2018, 6:49 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగానే అందరి కన్నా ఎక్కువ సంతోషించింది ఆయన అభిమానులే. అన్నయ్య వెంట మేమున్నాం అంటూ జనసేన జెండాలు పట్టుకుని జనసైనికులుగా మారి పవన్ కళ్యాణ్‌కు మద్దుతుగా నిలుస్తున్నారు. అయితే జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కేవలం జెండా పట్టుకుంటే చాలదని, కొత్తగా ఏమైనా చేయాలని పార్టీ నిడదవోలు నియోజకవర్గ నాయకుడు కస్తూరి సత్య ప్రసాద్(నాని) సంకల్పించారు. ‘రెడ్ రెవల్యూషన్’ పేరిట యువ జనసైనికుల సాయంతో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామస్థాయిలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు.
Samayam Telugu Janasena


గ్రామాల్లోని సమస్యలను గోడలపైకి ఎక్కించడంతో రెడ్ రెవల్యూషన్ ప్రయాణం మొదలైంది. నిడదవోలు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించిన కస్తూరి నాని.. అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ అదే గ్రామంలో ఓ గోడపై ఎరుపు రంగు పెయింట్ వేసి, దానిపై రాశారు. గ్రామంలోని, మండలంలోని, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు సమస్యల గురించి తెలిసేలా ఇలా వాటిని గోడపైకి ఎక్కించారు. ఇలా ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ‘రెడ్ రెవల్యూషన్’ పని ఇక్కడితో అయిపోలేదు.
గ్రామాల్లో ఎర్రటి గోడలపై రాసిన సమ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా తెలిసేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల నుంచి 10వేల పోస్టుకార్డులను సీఎంకు పోస్టు ద్వారా పంపించారు. రెడ్ రెవల్యూషన్ తరఫున ఆయా గ్రామాల్లో పోస్టుకార్డులు పంపిణీ చేసి, ఆ కార్డులపై నియోజకవర్గంలోని ప్రధానమైన మూడు సమస్యలు, అలాగే ఆయా గ్రామాల్లోని ముఖ్యమైన సమస్యలను స్వయంగా ప్రజలతో రాయించారు. ఆ కార్డులను ఆయా గ్రామాల ప్రజలు స్వయంగా తమ ఊళ్లో ఉన్న పోస్టుబాక్సుల్లో వేసి ముఖ్యమంత్రికి పంపించారు.

ఆ తరవాత, గ్రామాల్లో సమస్యలను కస్తూరి నాని స్వయంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెడ్ రెవల్యూషన్ సభ్యులు, జనసైనికులతో కలిసి నిడదవోలు నుంచి ఏలూరు వరకు రైలులో ప్రయాణించి కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లి సమస్యల గురించి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌తో చర్చించారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇలా గ్రామస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీని జనాల్లోకి తీసుకెళ్తున్నారు కస్తూరి నాని. పవన్ కళ్యాణ్ మీద అభిమానం, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే తాను ఈ రెడ్ రెవల్యూషన్‌ను స్థాపించి గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని నాని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.