యాప్నగరం

సొంత ఊరిలో ఓడిన మోదీ గెలిచినట్టా? ఓడినట్టా?: రేవంత్

తెలుగుదేశంలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన ఆ నోరే నేడు కండువా మారేసరికి విమర్శలు గుప్పిస్తోంది.

Samayam Telugu 19 Dec 2017, 2:55 pm
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై తెలంగాణ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన... ఎన్నికల్లో గెలవడానికి మోదీ దారుణంగా వ్యవహరించారని, అబద్ధపు ప్రచారాలతో లబ్ది పొందారని ఆరోపించారు. పాకిస్థాన్‌తో కలసి తనను హతమార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నిందంటూ మోదీ తప్పుడు ప్రచారాలు చేశారని విమర్శించారు. ప్రధాని సొంత నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కులం, మతం, అబద్ధాల ప్రాతిపదికగానే ప్రచారం కొనసాగిందని, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలకు మోదీ కులంరంగు పులిమారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అభివృద్ధి నినాదమే వినిపించలేదని, ఇక బీజేపీ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు.
Samayam Telugu revanth reddy criticise modi on gujarat victory
సొంత ఊరిలో ఓడిన మోదీ గెలిచినట్టా? ఓడినట్టా?: రేవంత్


ఇంతగా దిగజారిన ప్రధానమంత్రిని తాను ఇంతవరకు చూడలేదన్న రేవంత్... వాజ్‌పేయి హయాంలో ఒక్క ఎంపీని కొనుగోలు చేసి ఉంటే ఎన్డీయే ప్రభుత్వం నిలబడి ఉండేదని... కానీ ఆయన అలా చేయలేదని అన్నారు. మోదీ, అమిత్ షాలు ఎంతకైనా దిగజారుతారని, కేసీఆర్ మాదిరి వీరిద్దరూ గుజరాత్‌లో రాక్షస క్రీడను సాగించారని దుయ్యబట్టారు. సొంత ఊరిలో ఓడిన మోదీ గెలిచినట్టా? ఓడినట్టా? అని ప్రశ్నించారు. ఒక్క రాహుల్ గాంధీని ఓడించడానికి 182 మంది బీజేపీ నేతలు కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. మోదీని హత్య చేసేందుకు పాకిస్థాన్ సుపారీ తీసుకుంటే... ఆ దేశంపై యుద్ధ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ విజయంపై మోదీని ఇంతవరకు ఆ పార్టీ కురువృద్ధుడు అద్వానీ అభినందించలేదని... ఎంతగా దిగజారిపోయారో చెప్పడానికి ఇది నిదర్శనమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.