యాప్నగరం

కేసీఆర్... నిజమైన ఆట ఇప్పుడే మొదలైంది

పార్టీ మారాలని తాను నిర్ణయించుకున్న తరువాత, ఇంతకాలం ఆదరించిన చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

TNN 29 Oct 2017, 3:29 pm
పార్టీ మారాలని తాను నిర్ణయించుకున్న తరువాత, ఇంతకాలం ఆదరించిన చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబును కలిసి, తన మనసులోని మాట చెప్పానని, భవిష్యత్తులోనూ ఆయన అండ దండలు ఉండాలని కోరి వచ్చానని రేవంత్ తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "నేను అమరావతిలో చంద్రబాబునాయుడిని కలిసి, తెలంగాణలో ఉన్న పరిస్థితులను గురించి వివరించి, వారి ఆశీర్వాదం తీసుకుని, బెజవాడ కనకదుర్గమ్మకు దండం పెట్టుకుని కొడంగల్‌కు బయలుదేరి వచ్చినాని అన్నారు. ఇవాళ కూడా కొడంగల్ గుడికెళ్లి స్వామిని దర్శించి, ఆశీర్వాదం తీసుకుని మీ ముందుకు వచ్చానని వ్యాఖ్యానించారు. మీ అందరూ ఏదైతే తీర్మానం చేసి, నా మీద అభిమానం, నమ్మకం, విశ్వాసాన్ని ఉంచారో .. మీ అందరి నమ్మకం, విశ్వాసం తగ్గకుండా ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేలా, మీ ఆదేశాలు, ఆకాంక్షల మేరకు నడుచుకుంటానని చెప్పారు.
Samayam Telugu revanth reddy meets his followers at kodangal
కేసీఆర్... నిజమైన ఆట ఇప్పుడే మొదలైంది


కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి, తనకు మధ్య ఆట మొదలైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఓటుకు నోటు' కేసులో జైలుకు వెళ్లి, ఆపై బయటకు వచ్చిన రోజు చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలనే, కార్యకర్తల ఎదుట రేవంత్ మరోసారి గుర్తు చేశారు. "ఆట మొదలైందని జైలు నుంచి వచ్చినప్పుడే చెప్పినా... నిజమైన ఆట ఇప్పుడు మొదలైంది. ఫైనల్స్‌కు వచ్చేసింది. రేప్పొద్దున పీపుల్స్ ప్లాజాకు రండి. నక్లెస్ రోడ్డుమీద, హైదరాబాద్ నడిబొడ్డున, బుద్ధుడి ఎదురూగా నిర్ణయం తీసుకోనున్నా. ఆ నిర్ణయం ఈ రాష్ట్రంలో కేసీఆర్ పతనానికి నాంది పలకాలి. ఆ నిర్ణయం కేసీఆర్ దోపిడీని ఆపాలి" అని కార్యకర్తల ఈలలు, కేరింతల మధ్య వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.