యాప్నగరం

నంద్యాల దెబ్బ.. చంద్రబాబు అబ్బా: రోజా సెటైర్లు!

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. తెలుగు దేశం పార్టీపై వైఎస్సార్ సీపీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది

TNN 16 Aug 2017, 6:42 pm
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. తెలుగు దేశం పార్టీపై వైఎస్సార్ సీపీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. బుధవారం నంద్యాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. సెటైర్లు వేస్తూ చంద్రబాబును విమర్శించారు. ‘రాష్ట్రాన్ని దోచుకుని దాచుకుంటున్న చంద్రబాబు నాయుడుకి బుద్ధిచెప్పే అవకాశం ముందుగా నంద్యాల ప్రజలకు వచ్చినందుకు మీరు అదృష్టవంతులు’ అని రోజా అన్నారు.
Samayam Telugu roja setires on chandrababu naidu and telugu desam party
నంద్యాల దెబ్బ.. చంద్రబాబు అబ్బా: రోజా సెటైర్లు!


‘ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు.. ప్రజలు ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో చూపించాలనుకునే సమయంలో దురదృష్టవశాత్తు భూమా నాగిరెడ్డి చనిపోవడంతో నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చింది. ఆయన ఏ విధంగా మరణించారో మీకందరికీ తెలుసు. ఆయన మీద కేసులు పెట్టి, రౌడీ షీట్ తీసి, మంత్రి పదవి ఇస్తామని బెదిరించి పార్టీలోకి తీసుకెళ్లి.. ఆయణ్ని మానసిక క్షోభకు గురిచేసి చంపేశారు’ అని రోజా ఆరోపించారు.

ఈ ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని రోజా కోరారు. ‘ఈ నంద్యాల దెబ్బ.. చంద్రబాబుకి అబ్బా అనిపించేలా ఉండాలి’ అని సెటైర్ వేశారు. ఇది కేవలం ఉప ఎన్నికని తీసిపారేయడానికి లేదని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా నంద్యాల ప్రజల తీర్పు కోసం చూస్తున్నారని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.