యాప్నగరం

ఆత్మహత్యే శరణ్యం.. కలకలం రేపుతోన్న సీఐ వాట్సాప్ మెసేజ్

ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, వారి ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ పోలీస్ అధికారి వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌తో కలకలం రేగుతోంది.

Samayam Telugu 29 Apr 2019, 8:50 am
ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, వారి ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ పోలీస్ అధికారి వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌తో కలకలం రేగుతోంది. ‘మంచితనానికి, మానవత్వానికి ప్రతిరూపమైన డీజీపీ మహేందర్‌రెడ్డి సారథ్యంలో నడుస్తున్న పోలీసు వ్యవస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా బలిదానం తప్పదేమో. బలహీన క్షణాలు నాకు భయం కలిగిస్తున్నాయి’ అంటూ నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ సీఐ సూదిరెడ్డి దామోదర్‌రెడ్డి తన వాట్సాప్‌లో ఆదివారం పెట్టిన పోస్టింగ్‌ చర్చనీయాశంమైంది. అధికారుల ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉంది.. నా సమస్యకు ఆత్మహత్య ఒకటే మార్గమని అధికారిక వాట్సాప్‌ గ్రూపులో పంపడంతో అప్రమత్తమైన అధికారులు సీఐను సెలవుపై పంపారు.
Samayam Telugu CI


సీఐ దామోదర్‌రెడ్డికి ఏప్రిల్ 26న ఛార్జ్ మోమో జారీ చేసిన ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర... ఏడాది పాటు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందరాదంటూ అందులో పేర్కొన్నారు. సీఐ దామోదర్‌రెడ్డి బంధువులు ఓ సమస్యలో ఉండగా అవతలి వ్యక్తులను ఆయన నేరుగా బెదిరించడంతో వారు ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో, నిజామాబాద్ రేంజ్ డీఐజీ విచారణ జరిపి తుది నివేదికను ఐజీకి అందజేయడంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బోధన్‌ రూరల్‌ సీఐగా పనిచేసిన సమయంలో దామోదర్ రెడ్డిని ఒకసారి విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

1995 బ్యాచ్‌కు చెందిన దామోదర్‌రెడ్డి ప్రస్తుతం పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఆయనకు డీఎస్పీగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఈ సమయంలో ఛార్జి మెమో ఇవ్వడంతో ఆయన ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. తాజాగా వాట్సాప్‌ మెసేజ్‌తో అప్రమత్తమైన ఉన్నతాధికారులు సీఐని ఏప్రిల్ 27 నుంచి సెలవుపై పంపారు. ఓ ఎస్సైను తోడుగా ఇచ్చి సీఐ దామోదర్‌రెడ్డిని సెలవుపై ఇంటికి పంపి, ముందు జాగ్రత్తగా సర్వీస్‌ రివాల్వర్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.