యాప్నగరం

కొనసాగుతున్న 'రైతుబంధు' నగదు బదిలీ

ఇప్పటికే 34 లక్షల మంది రైతుల ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి. మిగతా 18 లక్షల మంది రైతులకు చెందిన ఖాతాలకు కూడా 10 నుంచి 15 రోజుల్లో జమయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Samayam Telugu 28 Nov 2018, 1:15 pm
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'రైతుబంధు' పథకం మొదటి విడత కార్యక్రమం విజయవంతంగా పూర్తియినప్పటికీ.. రెండో విడతకు వచ్చేనాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రెండో విడతలో కాస్త అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో చెక్కుల రూపంలో కాకుండా.. నేరుగా రైతుల ఖాతాలకే పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించి.. ఆమేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒకవైపు ఎన్నికల సంఘం షరతులను పాటిస్తూనే.. నిధుల కొరత, సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ నగదు బదిలీని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
Samayam Telugu Rythu-Bandhu1128


ఆపద్ధర్మ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలింగ్ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో యాసంగి పెట్టుబడి సాయం జమచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే 34 లక్షల మంది రైతులకు ఖాతాల్లో రూ.3,700 కోట్ల నగదును జమచేశారు.

యాసంగిలో రైతుబంధు కింద పెట్టుబడి సాయంగా రూ.5,200 కోట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 52 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ కోసం అక్టోబర్‌లో చెక్కులు సిద్ధం చేశారు. ఈలోగా ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పడంతో చెక్కుల ద్వారా కాకుండా నగదు బదిలీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయించారు.

ఎన్నికల కమిషన్ షరతులకు లోబడి అక్టోబర్ 22 నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రారంభమైంది. 52 లక్షల మంది రైతుల ఖాతాలు ఉండగా.. ఇప్పటికే 34 లక్షల మంది రైతుల ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి. మిగతా 18 లక్షల మంది రైతులకు చెందిన ఖాతాలకు కూడా 10 నుంచి 15 రోజుల్లో జమయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.