యాప్నగరం

అవినీతి పార్టీని సమర్దించడం ఈ కుహనా మేధావులకే చెల్లింది: సాధినేని యామిని

గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం లాంటి ఐఏఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 11 Dec 2018, 8:56 am
గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం లాంటి ఐఏఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. వీరిపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మేధావులమని చెప్పుకుంటున్న కొందరు రాష్ట్రంలో కుహనా రాజకీయాలకు పాల్పడుతున్నారని, వాళ్లంగా తమ తమ ముసుగులు తొలగించుకుని ఆయా పార్టీల్లో చేరి మాట్లాడితే ప్రజలు సరైన సమాధానం చెబుతారని యామిని దుయ్యబట్టారు. మాజీ సీఎస్‌ కల్లం అజేయ కల్లం, జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి తదితరులు ఆయా పార్టీలపై ఉన్న అంతులేని అభిమానానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలకు దిగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Yamini-Sadineni


ప్రభుత్వం, న్యాయశాఖలో అత్యున్నత పదవులు పొందినవారు తమ స్థాయికి భిన్నంగా మాట్లాడటం తగదని ఆమె సూచించారు. అంతేకాదు, అమరావతి నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న వారు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం తొలిదశలో రూ.46 వేల కోట్లు ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరిస్తే.. రూ.లక్ష కోట్ల అవినీతి ఏవిధంగా జరిగిందో చెప్పాలని యామినీ నిలదీశారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీని సమర్ధించేలా మాట్లాడటం ఈ కుహనా మేధావులకే చెల్లిందని ఆమె మండిపడ్డారు. ఏపీ రాజధాని పైరవీలకు తప్ప ఎందుకూ పనికి రాదని, రాజధాని పేరుతో భారీగా అవినీతి జరుగుతోందని అజయ్ కల్లం చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. పెద్ద నగరాల పేరుతో ప్రజలను పిచ్చివాళ్లను చేసే ప్రయత్నం జరుగుతోందని అజయ్ కల్లం వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.