యాప్నగరం

పులివెందులలో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం

కడప జిల్లా పులివెందుల రణరంగాన్ని తలపించింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావారణం నెలకొంది.

TNN 4 Mar 2018, 4:42 pm
కడప జిల్లా పులివెందుల రణరంగాన్ని తలపించింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావారణం నెలకొంది. పులివెందులలోని పూల అంగళ్ల సర్కిల్ వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్లదాడిలో పలువురు పోలీసులు సహా ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు తనిఖీలు చేస్తున్నారు. బయటి నుంచి ఎవరికీ పులివెందుల పట్టణంలోకి రావనివ్వడంలేదు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది.
Samayam Telugu section 144 imposed after tdp ycp clash in pulivendula
పులివెందులలో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం


పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి కారణం తామంటే తామని టీడీపీ, వైసీపీ కొన్ని రోజులుగా వాదిస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై మార్చి 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు ముందుగా సవాల్‌ విసిరారు. అధికార పార్టీ సవాల్‌కు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్పందించారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై పూల అంగళ్ల సర్కిల్‌ వద్దకానీ, వేంపల్లె అడ్డరోడ్డులోకానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ ప్రతి సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అక్కడికి చేరుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వేంపల్లిలో టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. పులివెందుల వెళ్లేందుకు ప్రయత్నించిన సతీష్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని వేంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు నిరసగా రెండు పార్టీల కార్యకర్తలు రోడ్డెక్కారు. వీరంతా పూల అంగళ్ల సర్కిల్ వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జి చేశారు. పులివెందులలో 144 సెక్షన్ విధించి ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.