యాప్నగరం

టీఆర్ఎస్ అభ్యర్థి నుంచి ప్రాణహాని.. సంచలన ఆరోపణలు!

2013లో కరీనంగర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుట్ట మధు.. మంథని నుంచి టీఆర్ఎస్ సీటు ఆశించారు. అందులో భాగంగా గుండా నాగరాజు అనే వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పారు

Samayam Telugu 8 Oct 2018, 11:36 pm
ఎన్నికలు సమీపిస్తుండగా టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, మంథని అభ్యర్థి పుట్ట మధుపై సంచలన ఆరోపణలు రావడం పార్టీలో కలకలం రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ టికెట్ కోసం ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని, ప్రస్తుతం తనను హత్య చేసేందుకు కుట్రపన్నాడని బాధితుడు బిళ్లా రమణారెడ్డి ఆరోపిస్తున్నారు. పుట్ట మధును మంథని నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Putta Madhu


తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం కలుసుకున్న రమణారెడ్డి తన గోడును వినిపించారు. పుట్ట మధు తనను హత్య చేయించాలని యత్నిస్తున్నాడని అందుకు బలమైన కారణం ఉందన్నారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ డీజీపీకి బాధితుడు రమణారెడ్డి ఓ లేఖ అందజేశారు. ‘2013లో కరీనంగర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుట్ట మధు.. మంథని నుంచి టీఆర్ఎస్ సీటు ఆశించారు. అందులో భాగంగా గుండా నాగరాజు అనే వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పారు.

జూన్ 6, 2013లో కేసీఆర్ పాల్గొన్న సభలో నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్ట మధుకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కోరుతూ నాగరాజు ప్రాణాలొదిలాడు. ఆత్మహత్య చేసుకుంటే రూ.50 వేలు ఇస్తానని, నువ్వు చనిపోతే నీ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నాగరాజును పుట్ట మధు నమ్మించాడని’ రమణారెడ్డి వెల్లడించారు. అయితే నాగరాజు ఆత్మహత్య కేసులో సాక్ష్యం చెప్పవద్దని తనను పుట్టమధు బెదిరిస్తున్నాడని డీజీపీకి రమణారెడ్డి వివరించారు. అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో పుట్ట మధు 2014 ఎన్నికల్లో గెలుపొందారు.
టీఆర్ఎస్ కార్యకర్త నాగరాజు ఆత్మహత్య కేసుకు సంబంధించిన కాల్‌డేటాతో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన వాంగ్మూల ప్రతులను డీజీపీకి రమణారెడ్డి అందజేశారు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు పుట్ట మధుపై కేసు నమోదు చేయలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల దృష్ట్యా తనకెలాంటి ఇబ్బంది కలగకూడదని, నాగరాజు ఆత్మహత్య రహస్యాలను ఎవరికీ చెప్పవద్దని పుట్ట మధు అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రమణారెడ్డి ఆరోపించారు. నాగరాజు మృతి కేసు విచారణను మళ్లీ చేపట్టాలని, అప్పుడే నిజాలు వెలుగుచూస్తాయని రమణారెడ్డి తన లేఖలో డీజీపీని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.