యాప్నగరం

‘గోదావరి’ గుండెల్లో చిరంజీవి.. కాటన్ దొర

‘కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు.

TNN 15 May 2017, 1:36 pm
‘కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం, సేవ కోసమే పరితపించేవారు.
Samayam Telugu sir arthur cotton birth anniversary
‘గోదావరి’ గుండెల్లో చిరంజీవి.. కాటన్ దొర


18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు అతివృష్టి , వరద ముంపు, అనావృష్టి , కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1833లో అనావృష్టి వల్ల కలిగిన కరువుతో రెడు లక్షల ప్రజలు తుడిచుపెట్టుకు పోయారు. అలాగే 1839లో ఉప్పెన, కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట కట్ట వేయాలని కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ జలాశయం నిర్మించారు.

సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాన్ని, కొన్ని నదుల అనుసంధానాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం.. వాటివలన కలిగే ఇబ్బందులు కాదు. పెట్టుబడి ఎంత?.. వచ్చే రాబడి, కట్టాల్సిన వడ్డీ ఎంత?.. అంటూ లెక్కలు వేయటం. బ్రిటీష్ ప్రభుత్వ వాదనను కాటన్‌ వ్యతిరేకించారు. పాలితుల సుఖాలు, ప్రాణాలు కరువుతో ముడిపడి ఉన్నాయని, పాలకులు ధర్మంగా, బాధ్యతగా కరువు నివారణ పనులు చేపట్టాలని పోరాటం జరిపారు.

ఫలితంగా గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట రూపొందింది. 1847 - 52 మధ్య కాలంలో గోదావరిపై తూర్పగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశారు. దీంతో క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కర్యాన్ని ఆయన కేవలం అయిదేళ్లలో పూర్తి చేయడం గమనార్హం. కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల ఆర్థిక, జీవనగతులను మార్చేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా కాటన్ దొర ఈ రెండు జిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.

ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, ఇలా సంకల్పం చెప్పుకునేవారు.
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)

ఉభయ గోదావరి జిల్లాలలోని చాలా గ్రామాల్లో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రం మీద స్వారీచేస్తున్న కాటన్ దొర. బ్రిటీషు వారు మనదేశాన్ని వదిలిపెట్టి పోయినా.. ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి 150 ఏళ్లు గడిచినా గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ దొర ఇంకా చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో అర్థమవుతోంది. నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరించుకుందాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.