యాప్నగరం

టీఆర్ఎస్‌తో తెలంగాణకే నష్టం: సోమిరెడ్డి

చంద్రబాబు కారణంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యలను సోమిరెడ్డి గుర్తుచేశారు.

Samayam Telugu 4 Oct 2018, 1:25 pm
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని, అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని కేసీఆర్ అంటున్నారని, కానీ తెలంగాణ ఉన్నంతకాలం టీడీపీ కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి సోమిరెడ్డి గురువారం మీడయాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఓటమి భయమే కారణమన్నారు.
Samayam Telugu Somireddy Chandramohan Reddy


చంద్రబాబు వల్లే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యలను సోమిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీ లేదని ప్రచారం చేస్తున్నప్పటికీ చంద్రబాబును చూసి ఈర్ష్యపడి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుపై కేసీఆర్‌ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. టీఆర్ఎస్ వల్లే తెలంగాణకు నష్టం జరుగుతుందని ప్రజలు తొందర్లోనే గుర్తిస్తారని చెప్పారు. ఆంధ్రావాళ్లను తిడితే ఓట్లు పడతాయని కేసీఆర్ భావించడం మంచిది కాదని హితవు పలికారు.

మహాకూటమిలో టీడీపీ చేరడంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే గతంలో టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఏం చేశారో గుర్తుంచుకోవాలన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి మహాకూటమిలో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్ఎస్‌లో చేరి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో అధికులు టీడీపీ నుంచి వచ్చినవారేనన్నారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి సోమిరెడ్డి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.