యాప్నగరం

బాబునో, నన్నో చూసి కంపెనీలు రావు: జగన్

చంద్రబాబు ముఖరావిందాన్నో, నన్నో చూసి.. ఎలాంటి అభివృద్ధి జరగదు, ఎలాంటి ప్రాజెక్టులూ రావు... ’

TNN 10 Oct 2017, 2:06 pm
‘ఏపీకి కొత్తగా ఏ కంపెనీలు రావాలన్నా, ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలన్నా, హాస్పిటళ్లు నిర్మించాలన్నా.. ఇంకేలాంటి ప్రాజెక్టులు రావాలన్నా.. ప్రత్యేక హోదా అవసరం. అంతే కానీ, చంద్రబాబు ముఖరావిందాన్నో, నన్నో చూసి.. ఎలాంటి అభివృద్ధి జరగదు, ఎలాంటి ప్రాజెక్టులూ రావు... ’ అని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ‘యువభేరీ’ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
Samayam Telugu spl status is the key for ap development ys jagan
బాబునో, నన్నో చూసి కంపెనీలు రావు: జగన్


ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పారని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఐదు కాదు, పది, పదిహేను సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని వ్యాఖ్యానించారని, తమకు అధికారం ఇస్తే అన్నేళ్ల పాటు ప్రత్యేక హోదాను ఇస్తామని వారు ప్రజలకు హామీని ఇచ్చారని జగన్ అన్నారు. అయితే అధికారం చేతికి అందాకా.. మాట తప్పారు అని జగన్ విమర్శించారు.

ప్రత్యేక హోదాతో చాలా రాష్ట్రాల్లో డెవలప్ మెంట్ జరిగిందని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో తెలుగుదేశం నేతలే పెట్టుబడి పెట్టారని జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే భారీ ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, లక్షల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని జగన్ అన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా రావాల్సిందని, విభజనతో అన్యాయం అయిన ఏపీకి ప్రత్యేక హోదానే వచ్చి ఉంటే.. ఈ పాటికే ఎన్నో అవకాశాలు పెరిగేవి అని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ అన్నారు. అలాగే యువభేరీ తరహాలో మరిన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఇన్నాళ్లూ విద్యార్థులకు సెలవులు, అడ్మీషన్లు వంటి కార్యక్రమాలు ఉండటం చేత ‘యువభేరీ’ కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు. అలాగే నవంబర్ రెండో తేదీ నుంచి తన పాదయాత్ర సాగుతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల దూరంతో పాదయాత్రను చేయనున్నాను అని జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రత్యేకహోదా అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.