యాప్నగరం

రాం మాధవ్‌తో పవన్ కళ్యాణ్ రహస్య భేటీ.. బీజేపీ, జనసేన దోస్తీ?

తానా సభల కోసం అమెరికా వెళ్లిన జనసేనాని బీజేపీ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారని సమాచారం. వీరిద్దరూ గంటన్నరకుపైగా చర్చలు జరిపారని తెలుస్తోంది.

Samayam Telugu 6 Jul 2019, 10:46 pm
తానా సభల్లో పాల్గొనడం కోసం వాషింగ్టన్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. బీజేపీ కీలక నేత రాం మాధవ్‌తో భేటీ అయ్యారు. గంటన్నర సేపు వీరిద్దరూ చర్చలు జరిపారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగింది. తానా సభలకు హాజరైన వీరిద్దరూ ప్రైవేట్‌గా వేరేచోట సుదీర్ఘంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జనసేన బీజేపీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. పార్టీని బీజేపీలో విలీనం చేయడమా లేదంటే ఆ పార్టీకి మద్దతుగా పనిచేయడమా అన్న అంశంపై చర్చ నడుస్తోందని సమాచారం.
Samayam Telugu పవన్


ఏపీలో బలోపేతం కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న వ్యక్తితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పుడిప్పుడే టీడీపీ నుంచి కొంతమం‌ది బీజేపీలో చేరుతున్నప్పటికీ.. చరిష్మా ఉన్న నేత కోసం బీజేపీ గాలిస్తోంది. ఎన్నికల ముందు కూడా బీజేపీ తరఫున కొంతమంది నేతలు పవన్ కల్యాణ్‌తో భేటీ అయి.. తమతో కలిసి పనిచేయాలని కోరారు. పవన్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తాము సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధిస్తామని పవన్ భావించారు. కానీ ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కింది. పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండుస్థానాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. దీంతో జనసేన ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది.

పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలు కూడా వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. అందుకే కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు పవన్ కల్యాణ్ పదేపదే ప్రయత్నిస్తున్నారు. తాను బతికున్నంత వరకూ పార్టీని నడుపుతానని చెబుతున్నారు. తాజాగా ఆయన తానా వేడుకల్లో హాజరయ్యేందుకు అమెరికా వెళ్లారు. అక్కడే అదే తానా సభలకు వచ్చిన రాం మాధవ్‌ను రహస్యంగా వాషింగ్టన్‌లో కలిశారు.

వాస్తవానికి ఇదంతా ముందుగా ప్లాన్ చేసిందే అని బీజేపీ నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా తమతో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతున్నారని, అందుకే ఈ భేటీ ఏర్పాటు చేశామంటున్నారు. జనసేనను తమ పార్టీలో విలీనం చేయమని బీజేపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. దానికి పవన్ కల్యాణ్ అంగీకరించకపోతే.. ఆయన రాం మాధవ్ ముందు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచుతారనేది చూడాలి.

పవన్, రాం మాధవ్ చర్చల్లో ఏం మాట్లాడారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారనే విషయమై పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ.. కచ్చితంగా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనే సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి. జనసేన పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో 18 లక్షలకు పైగా ఓట్లు అంటే 7 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. నేతల చేరికలతో బీజేపీ పరిస్థితి మెరుగయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.