యాప్నగరం

పిచ్చోడి చేతిలో రాయిలా వైసీపీ పాలన.. అమరావతి విలువ పడిపోయింది: చంద్రబాబు

వైఎస్సార్‌సీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష అంశంపై విమర్శలు గుప్పించారు. అమరావతి విలువ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 15 Jul 2019, 11:55 pm
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల తీరుపై వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీపై బురద జల్లడమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధికి గండికొట్టేలా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పీపీఏలలో అవినీతి లేదని, విద్యుత్‌ రంగానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి, కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖలు రాసినా ఆ పార్టీ నేతలు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం (జులై 15) సాయంత్రం ఆయన అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
Samayam Telugu babu
చంద్రబాబు నాయుడు


విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై కేంద్రం ఒకరకంగా చెబుతుంటే.. రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ నేతలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్‌సీపీకి అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ చేతకానితనం కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని నిర్మాణ పనులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతిష్ఠంభన తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుతో పోలవరం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

అమరావతిలో ఉన్నది ముళ్ల కంపలు మాత్రమేనని అమెరికాలో ఆ పార్టీ నేతలు చెప్పడం రాజధానిపై విషంకక్కడమేనని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం నిర్వాకాల వల్ల ఇప్పటికే రాజధాని అమరావతిలో భూముల విలువ పడిపోయిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ తీరుతో పలు కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.